అంగన్‌వాడీల్లో పౌష్టికాహారం

కరీంనగర్‌,జనవరి25(జ‌నంసాక్షి): జిల్లాలోని ఆంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి చిన్నారికీ పౌష్ఠికాహారం అందిస్తున్నామని ఐసీడీఎస్‌ పీడీ అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల బలోపేతానికి ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. గర్భిణులతోపాటు బాలింతలకు పౌష్ఠికాహరం అందించనున్నట్లు తెలిపారు. పిల్లలకు ప్రతిరోజూ పౌష్ఠికాహారం అందుతున్నదా లేదా అనేది పిల్లల తల్లులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కెస్లాపూర్‌ గ్రామస్తులు పలువురు మాట్లాడుతూ.. గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో ప్రతిరోజూ తమపిల్లలకు కోడిగుడ్లతోపాటు అన్ని రకాల పౌష్ఠికాహారం అందిస్తున్నారని తెలిపారు. ప్రతి అంగన్‌వాడీ కేంద్రం పరిధిలోని అన్ని గ్రామాల్లో ఇంటింటా సర్వే చేపడుతూ పౌష్ఠికాహారం అందిస్తున్న తీరును తెలుసుకుంటున్నామన్నారు. ఆరోగ్య విషయాల్లో గ్రామాల్లో పనిచేస్తున్న అంగన్‌వాడీ కార్యకర్తలు అవగాహన కల్పిస్తున్నారన్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు స్థానికంగానే ఉంటూ గ్రామాల పిల్లలతోపాటు గర్భిణులు, బాలింతలకు మరింత మెరుగైన సేవలు అందిస్తున్నారన్నారు.