అంత్యక్రియలకు డబ్బులు లేని దైన్యం

ఫ్రిడ్జిలో తాత శవాన్ని భద్ర పరచిన మనవడు
పోలీసలు తనిఖీలో వెల్లడైన పచ్చి నిజం
వరంగల్‌,అగస్టు12(జనం సాక్షి): అసలే పేదరికం..ఆపై తాత మరణం.. చేతిలో చిల్లిగవ్వ లేని దయనీయ స్థితి. పగవాడికి కూడా రాకూడదని కోరుకునే దుర్భర పరిస్థితి ఇది. దీంతో.. ఆ యువకుడు తన తాత శవాన్ని రెండు రోజుల పాటు ఫ్రీడ్జ్‌లో దాచాడు. డబ్బులు సమకూర్చుకునే వరకూ శవాన్ని కుళ్లిపోకుండా ఉండేందుకు ఈ అసాధారణ ఆలోచన చేశాడు. పరకాల సగర వీధిలో అమానుష ఘటన జరిగింది. బాలయ్య(95) అనే వృద్ధుడు రెండు రోజుల కిందట మృతి చెందాడు. అయితే అంత్యక్రియలకు డబ్బులు లేక బాలయ్య మృతదేహాన్ని మనవడు ఫ్రిడ్జ్‌లో దాచాడు. బాలయ్య, ఆయన మనవడు ఇద్దరూ పరకాల సగర వీధిలో నివాసం ఉంటున్నారు. కొద్ది రోజులుగా బాలయ్య అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆయన ఆరోగ్యం విషమించి రెండు రోజుల కిందట మృతి చెందాడు. బాలయ్య ఆచూకి తెలియకపోవడం అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో విచారణలో భాగంగా బాలయ్య ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. బాలయ్య మనవడిని విచారించగా తన తాత మృతదేహాన్ని ఫ్రిడ్జ్‌లో దాచినట్లు చెప్పాడు.