అంత్యక్రియలకు తీసుకెళ్తుంటే కళ్లు తెరిచాడు

81487581161_160x120ధార్వాడ్: కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో చనిపోయాడని భావించిన ఓ టీనేజ్ కుర్రాడు అంత్యక్రియల్లో కళ్లుతెరిచాడు. మనగుండి గ్రామంలో జరిగిన ఈ ఘటనపై బంధువులతో పాటు గ్రామస్తులు సంభ్రమాశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 17 ఏళ్ల కుమార్ మరేవాద్ చదువు మానేసి రోజువారి కూలీలైన తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటున్నాడు. నెలరోజుల క్రితం వీధికుక్క కరవడంతో అస్వస్థతకు గురయ్యాడు. వారం రోజుల క్రితం తీవ్ర జ్వరంతో బాధపడుతూ ధర్వాడీ ఆస్పత్రిలో చేరాడు. పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. కాగా శరీరం మొత్తం ఇన్‌ఫెక్షన్ ప్రబలినందున కుమార్ కోలుకోవడం కష్టమనీ… వెంటిలేటర్ తీసేస్తే బతకడని డాక్టర్లు అతడి బంధువులకు చెప్పారు. దీంతో ఆ కుటుంబం అతడిని ఇంటికి తీసుకెళ్లారు. శరీరంలో ఎలాంటి కదలికలు లేకపోవడం, శ్వాసకూడా తీసుకోకపోవడంతో చనిపోయినట్టు భావించి అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. గ్రామానికి ఆవల రెండుకిలోమీటర్ల దూరంలో అంత్యక్రియల ప్రాంతానికి తీసుకెళ్తుండగా కుమార్ ఒక్కసారిగా కళ్లుతెరిచాడు. కాళ్లు చేతులు ఆడిస్తూ గట్టిగట్టిగా శ్వాసపీల్చడం మొదలుపెట్టాడు. దీంతో ఆశ్చర్యపోయిన బంధువులు కుమార్‌ను ఆస్పత్రికి తరలించారు.