అఖిలేశ్‌, ములాయంకు ఊరట

– ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో క్లీన్‌చిట్‌
– సుప్రింలో అఫిడవిట్‌ దాఖలు చేసిన సీబీఐ
న్యూఢిల్లీ, మే21(జ‌నంసాక్షి) : సార్వత్రిక ఎన్నికల ఫలితాలు మరో రెండురోజుల్లో వెలవడనున్న నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌కు ఊరట లభించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వీరికి క్లీన్‌చిట్‌ ఇస్తూ సుప్రీంకోర్టులో సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది. అఖిలేశ్‌, ములాయంపై రెగ్యులర్‌ కేసు నమోదు చేసేందుకు తమకు ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని, అందుకే 2013 ఆగస్టులోనే ఈ కేసును మూసేసినట్లు సీబీఐ అఫిడవిట్‌లో పేర్కొంది. ములాయం కుటుంబం అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆదాయానికి మించి ఆస్తులను సమకూర్చుకుందని గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ కాంగ్రెస్‌ నేత విశ్వనాథ్‌ చతుర్వేదీ 2005లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 2007 మార్చి 1న ములాయం, ఆయన కుమారులు అఖిలేశ్‌ యాదవ్‌, ప్రతీక్‌
యాదవ్‌, కోడలు డింపుల్‌ యాదవ్‌లపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. ఆ తర్వాత కేసు నుంచి డింపుల్‌ యాదవ్‌కు మినహాయింపు కల్పించింది. అయితే ఇంతవరకు ఈ కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపోవడంతో విశ్వనాథ్‌ ఇటీవల మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో విచారణ చేపట్టిన న్యాయస్థానం.. సీబీఐపై ప్రశ్నల వర్షం కురిపించింది. ములాయం, అఖిలేశ్‌పై కేసు ఏమైంది.. అసలు కేసు నమోదు చేశారా లేదా.. అని గట్టిగానే ప్రశ్నించింది. దర్యాప్తుపై తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీంతో మంగళవారం సీబీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది. ములాయం, అఖిలేష్‌ యాదవ్‌లకు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు తమ విచారణలో తేలలేదంటూ సీబీఐ క్లీన్‌చిట్‌ ఇస్తూ సుప్రింకోర్టుకు సమర్పించింది.