అగ్రస్థానాన్ని కోల్పోయిన టీమిండియా

– టీమిండియాను వెనక్కి నెట్టిన ఇంగ్లండ్‌
– టీ20ల్లో మూడవ స్థానంలో భారత్‌సేన
దుబాయ్‌, మే2( జ‌నం సాక్షి) : టెస్టుల్లో అగ్రస్థానాన్ని తిరిగి సొంతం చేసుకున్న టీమిండియాకు కోహ్లీ సేనకు వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో నిరేశే ఎదురైంది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తాజాగా ర్యాంకులు ప్రకటించగా.. వన్డేల్లో విరాట్‌ కోహ్లీ సేన  నెంబర్‌ వన్‌ ర్యాంకును కోల్పోయింది. ఇంగ్లండ్‌ 125 పాయింట్లతో టాప్‌ ర్యాంకు సొంతం చేసుకుంది. కాగా, టీ20ల్లో భారత్‌ రెండు పాయింట్లు సాధించినా.. మూడో స్థానంలోనే కొనసాగుతోంది. వన్డే ర్యాంకుల విషయంలో 2015-16, 2016-17 సీజన్లను లెక్కలోకి తీసుకుని ఐసీసీ తాజా ర్యాంకులను వెల్లడించింది. ఒక పాయింట్‌ కోల్పోయిన భారత్‌ 122 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, 8 పాయింట్లు సాధించిన ఇంగ్లండ్‌ అగ్రస్థానం కైవసం చేసుకుంది. 2013 జనవరి తర్వాత ఇంగ్లండ్‌ టాప్‌ ర్యాంకు దక్కించుకుకోవడం ఇదే తొలిసారి. కాగా వన్డే ర్యాకింగ్‌లో పాకిస్తాన్‌(102), బంగ్లాదేశ్‌ (93), శ్రీలంక(77), వెస్టిండీస్‌ (69), అఫ్గానిస్తాన్‌ (63) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌
పొట్టి ఫార్మాట్‌ ర్యాంకుల్లో మాత్రం అంతగా మార్పుల్లేవు. టాప్‌-5 జట్లు అదే ర్యాంకులో కొనసాగుతున్నాయి. పాకిస్తాన్‌ 130 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆస్టేల్రియా (126), భారత్‌ (123), న్యూజిలాండ్‌ (116), ఇంగ్లండ్‌ (115), దక్షిణాఫ్రికా(114) టాప్‌ 5 స్థానాలు మళ్లీ నిలబెట్టుకున్నాయి. టీమిండియా రెండు పాయింట్లు సాధించినా మూడో స్థానంలోనే కొనసాగుతోంది. దిగ్గజాల రిటైర్మెంట్‌తో శ్రీలంక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ఎంతగా అంటే.. పసికూన అఫ్గానిస్తాన్‌ జట్టు శ్రీలంను వెనక్కునెట్టి 8వ స్థానంలో నిలిచింది. బంగ్లాదేశ్‌ (10) చివరి స్థానంలో నిలిచింది.
————————————————–