అగ్రిగోల్డ్‌ బాధితులను..  ప్రభుత్వ సొమ్ముతో ఆదుకుంటాం


– అగ్రిగోల్డ్‌ బాధితుల తరుపున పోరాడేవారిని బాబు, లోకేశ్‌ బెదిరిస్తున్నారు
– అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా వైసీపీ ఉంటుంది
– వైసీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి
విజయవాడ, నవంబర్‌20(జ‌నంసాక్షి) : వైసీపీ అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులకు ప్రభుత్వ సొమ్ముతో ఆదుకుంటామని వైసీపీ అధికార ప్రతినిధి పార్థసారధి ప్రకటించారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం జరిగే వరకు తమ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. టీడీపీ ప్రభుత్వం కుట్రల కారణంగా కొన్ని లక్షల కుటుంబాలు కంటివిూద కునుకులేకుండా గడుపుతున్నాయని మండిపడ్డారు. అగ్రిగోల్డ్‌ సమస్యను పరిష్కరించాలనే చిత్తశుద్ది లేని కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. అగ్రిగోల్డ్‌ బాధితుల తరుఫున పోరాడుతున్న న్యాయవాది రవిచంద్రన్‌ను సీఎం చంద్రబాబు, లోకేష్‌లు బెదిరిస్తున్నారని తెలిపారు.  ‘హాయ్‌లాండ్‌ ఆస్తులను కొట్టేయాలనే ఉద్దేశ్యంతోనే అగ్రిగోల్డ్‌ వ్యవహారాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే సీబీఐని రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకుంటున్నారన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకు న్యాయం చేస్తామని 2017లోనే చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారని, కానీ ఇంతవరకు దాని ఊసే లేదని, అగ్రిగోల్డ్‌పై స్వతంత్ర సంస్థతో విచారణ జరిపించాలన్నారు. దాని వెనుక ఉన్న వ్యక్తులెవరో బయటకు రావాలన్నారు. ఏపీపై ప్రజలకున్న ప్రేమను అడ్డుపెట్టుకుని చంద్రబాబు నాటకాలు అడుతున్నారన్నారు. రాజధాని తాత్కాలిక భవనాలకు వేల కోట్లు ఖర్చు చేశారని, కానీ వర్షం వస్తే కురిసే విధంగా నిర్మాణం చేశారన్నారు. అలాంటి భవనాలకు కోట్లు ఖర్చు అవుతాయా అని ప్రశ్నించారు. మాజీ సీఎస్‌లు లేవనెత్తిన ప్రశ్నలకు చీఫ్‌ సెక్రటరీతో జవాబు చెప్పించండని అన్నారు.