అథ్లెట్‌ హిమదాస్‌కు అభినందనలు

దేశం గర్విస్తోందన్న ప్రధాని మోడీ
న్యూఢిల్లీ,జూలై22(జ‌నంసాక్షి): అద్భుత ప్రదర్శన చేస్తున్న భారత స్టార్‌ అథ్లెట్‌ హిమదాస్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.  ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తదితరులు ఆమెను  కొనియాడారు. హిమ్‌దాస్‌ను చూసి దేశం గర్విస్తుందని, నెల వ్యవధిలోనే ఐదు అంతర్జాతీయ స్వర్ణాలు దేశానికి అందించినందుకు అభినందలు తెలిపారు. పరుగుల తార హిమదాస్‌ నెల వ్యవధిలోనే ఐదు స్వర్ణాలు సాధించి రికార్డు సృష్టించింది. దీనిపై భారత ప్రధాని స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. ‘గత కొన్ని రోజులుగా అద్భుతంగా రాణిస్తున్న  హిమదాస్‌ను చూసి దేశం గర్విస్తోంది. దేశం తరఫున ఐదు అంతర్జాతీయ స్వర్ణాలను సాధించినందుకు ఆమెను చూసి అందరూ సంతోషిస్తున్నారు. ఆమెకు అభినందలు. భవిష్యత్తులో మరింత రాణించాలని కోరుకుంటున్నాను.’ అని ట్వీట్‌ చేశారు. 19 ఏళ్ల స్పింటర్‌ హిమదాస్‌కు భారత క్రికెట్‌ లెజెండ్‌ సచిన్‌ తెందుల్కర్‌ కూడా అభినందలు తెలియజేశాడు. గత 19 రోజులుగా యూరప్‌లో విూరు రాణించిన తీరు ఎంతో బాగుంది. గెలవడానికి విూరు పడే శ్రమ, పట్టుదల యువతకు ప్రేరణ కలిగిస్తుంది. ఐదు పతాకాలను సాధించినందుకు అభినందలు. రాబోయే రేసుల్లో రాణించాలని కోరుకుంటున్నాను.’ అని పేర్కొన్నాడు. హిమదాస్‌కు ప్రముఖలు నుంచి ఎన్నో ప్రశంసలు దక్కుతున్నాయి. హిమదాస్‌ పాంజ్‌సన్‌ అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ ప్రిక్స్‌, కుట్నో అథ్లెటిక్‌ విూట్‌, క్లాడ్నో అథ్లెటిక్‌ విూట్‌, టాబోర్‌అథ్లెటిక్‌ విూట్‌, చెక్‌ రిపబ్లిక్‌ అథ్లెటిక్స్‌ విూట్‌లలో స్వర్ణాలను సాధించింది. అయితే ఆమె సెప్టెంబర్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్‌  ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించలేకపోయింది.