అదృశ్యమైన బాలుడి మృతదేహం లభ్యం

ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి
హైదరాబాద్‌,అక్టోబర్‌22 (జనంసాక్షి): నగర శివార్లలోని హైదర్‌గూడలో విషాదం చోటుచేసుకుంది. హైదర్‌గూడలోని సిరిమ్లలె కాలనీకి చెందిన అన్వేశ్‌ అనే ఆరేండ్ల బాలుడు గురువారం మధ్యాహ్నం అదృశ్యమయ్యాడు. అయితే అతని మృతదేహం ఇంటి సవిూపంలోని చెరువులో ప్రతక్ష్యమయింది. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఆడుకుంటూ.. బిల్డింగ్‌పై నుంచి కిందికి వచ్చాడు. అయితే సాయంత్రం అయినప్పటికీ అతడు తిరిగి రాలేదు. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లిదండ్రులు.. ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో ఇంటి సవిూపంలో ఉన్న చెరువులో అతని మృతదేహాన్ని గుర్తించారు. ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అన్వేశ్‌ మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అయితే రెండు రోజుల క్రితం బ్యాటరీ బైక్‌ కొనివ్వాలని అన్వేశ్‌ తన తండ్రిని కోరాడు. దీంతో ఆన్‌లైన్‌లో ఆడర్‌ పెట్టానని, రెండు రోజుల్లో వస్తుందని అన్వేశ్‌ తండ్రి అతనికి చెప్పాడు. కాగా, రెండు రోజులవుతున్నప్పటికీ బైక్‌ రాకపోవడంతో అతడు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడని స్థానికులు చెబుతున్నారు.