అఫ్ఘాన్‌తో టెస్ట్‌లో శిఖర్‌ ధావన్‌ వీరబాదుడు

సెంచరీతో అదరగొట్టిన గబ్బర్‌

బెంగళూరు,జూన్‌14(జ‌నం సాక్షి): చిన్నస్వామి స్టేడియం వేదికగా అఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో టీమిండియా ఓపెనర్‌ ధవన్‌ దుమ్మురేపాడు. కేవలం 87 బంతుల్లో 18 ఫోర్లు, మూడు సిక్సర్లతో కెరీర్‌లో ఏడవ సెంచరీని నమోదు చేశాడు. ధవన్‌ ధాటికి భారత్‌ భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. వీళ్లిద్దరూ వికెట్‌ పడకుండా ఆడుతున్నారు. ధవన్‌ వేగంగా ఆడుతుండగా, విజయ్‌ మాత్రం నెమ్మదిగా ఆడుతున్నాడు. ప్రపంచ మేటి బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ను భారత ఓపెనర్లు అలవోకగా ఆడుతున్నారు. ఇప్పటి వరక రషీద్‌.. ఏడు ఓవర్లు బౌలింగ్‌ చేసి 51 పరుగులు ఇచ్చాడు. ధవన్‌ దూకుడుకు.. విజయ్‌ నిలకడ తోడవడంతో అఫ్ఘాన్‌ బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు. మొదటి నుంచే దూకుడుగా ఆడుతున్న ధావన్‌.. ఎడాపెడా బౌండరీలు బాదుతూ జోరు కనబర్చాడు. ఈ క్రమంలో రషీద్‌ ఖాన్‌ వేసిన 26ఓవర్‌లో బౌండరీ బాది టెస్టుల్లో ఏడో శతకాన్ని సాధించాడు. మరో ఓపెనర్‌ మురళీ విజయ్‌ నిలకడగా ఆడుతూ అర్ధశతకం దిశగా అడుగులు వేస్తున్నాడు. దీంతో లంచ్‌ విరామానికి 27ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెటేవిూ కోల్పోకుండా158పరుగులు చేసింది. అయితే మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. వర్షం పడుతుండటంతో మ్యాచ్‌ నిలిచిపోయింది. 96 బంతుల్లోనే ధావన్‌ సెంచరీ చేయగా ఆ తర్వాత కొంతసేపటికే అహ్మద్జాయి బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన రాహుల్‌(33 నాటౌట్‌)తో జట్టుకట్టిన మురళీ జోరును ఏమాత్రం తగ్గించలేదు. ఫ్ఘాన్‌ బౌలర్లలో యామిన్‌ అహ్మద్జాయి ఒక్కడే వికెట్‌ తీసుకోగా మిగిలిన బౌలర్లందరూ పరుగులు సమర్పించుకున్నారు. మరోవైపు టీ20 సూపర్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్‌ బౌలింగ్‌ పేలవంగా సాగింది. వేసిన తొలి ఓవర్‌లోనే భారీగా పరుగులు ఇచ్చాడు. ఆట నిలిచే సమయానికి భారత్‌ స్కోర్‌ వికెట్‌ నష్టానికి 248 పరుగులుగా ఉంది.