అబ్దుల్లాపూర్‌మెట్‌ ఘటనలో మరొకరు మృతి

హైదరాబాద్‌,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): గత నెల 4న అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డిని మంటల నుంచి కాపాడబోయి తీవ్రంగా గాయపడిన అటెండర్‌ కె. చంద్రయ్య(52) కంచన్‌బాగ్‌లోని అపోలో డీఆర్టీఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 28 రోజులుగా ఆస్పత్రిలోని బర్నింగ్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఆయన సమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఒక్కసారిగా మాట పడిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుండటంతో కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు వైద్యులు కృతిమ శ్వాసను అందించారు. 24గంటలు గడిస్తేగానీ ఏవిూ చెప్పలేమని డాక్టర్లు పేర్కొన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కానీ పరిస్థితి విషమించడంతో చంద్రయ్య తుది శ్వాస విడిచారు. ఈ ఘటనలో విజయారెడ్డితో పాటు డ్రైవర్‌ ఇప్పటికే మృతి చెందారు. దీంతో మొత్తంముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.