అభివృద్దిలో మరింత ఊపు

రేపటి ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ విజయం తథ్యం: ఎమ్మెల్యే

వరంగల్‌,ఆగస్ట్‌28(జ‌నం సాక్షి ): నాలుగేళ్లలో సిఎం కెసిఆర్‌ తెలంగాణను ఎంతో అభివృద్ధి చేశారని, భవిష్యత్తులోనూ మరింతగా అభివృద్ధి చేస్తారని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. వచ్చే ఎన్నికల్లో తెరాస జైత్రయాత్ర కొనసాగుతుందని అన్నారు. ముందస్తు అయినా, వెనకస్తు అయినా విజయం కెసిఆర్‌దేనని అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు చరిత్రలో నిలిచిపోయే పథకమే గాకుండా దేశానికి మార్గదర్శనం చేయనుందని అన్నారు. 2004 ఎన్నికల్లో దిక్కులేక మనతో కాంగ్రెస్‌ నేతలు పొత్తుకు దిగారని.. సోనియా నుంచి జీవన్‌రెడ్డి వరకు గులాబీ కండువాలు ధరించారని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు తెలంగాణ అభివృద్దికి వారే అడ్డంకిగా మారారని అన్నారు. ప్రాజెక్టులను అడ్డుకోవడం వల్ల నష్టపోయేది ప్రజలు మాత్రమేనని అన్నారు. ఎస్సారెస్పీ కట్టిన నాటి ప్రణాళికలకు అనుగుణంగా నీళ్లు ఇవ్వకపోవడంతో దానిని ఎల్లంపల్లి నుంచి వరద కాలువ ఆధారంగా రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నింపి కళకళలాడేలా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కంకణం కట్టుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ హయాంలో విత్తనాలు, ఎరువుల కోసం రైతులు బారులు తీరాల్సి వచ్చేదని.. నిలుచోలేక చెప్పులు వరుసలో పెట్టి ఎర్రటి ఎండలో బయటకు వెళ్లేవారని… పోలీస్‌ స్టేషన్లలో పెట్టి విత్తనాలు పంపిణీ చేసిన రోజులున్నాయని… ప్రస్తుతం విత్తనాలు, ఎరువులకు ఎక్కడా కొరత లేదన్నారు. మంచినీళ్లు ఇచ్చే మిషన్‌ భగీరథను..వూరందరికీ ఉపయోగపడే మిషన్‌ కాకతీయను కవిూషన్‌ భగీరథ.. కవిూషన్‌ కాకతీయ అంటూ విమర్శించడం కాంగ్రెస్‌ నేతల తీరుకు అద్దంపడుతోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అభివృద్దికి చేస్తున్న కృషి కాంగ్రెస్‌ నేతలకు కళ్లు బైర్లు కమ్మాయన్నారు. వందల సంఖ్యలో అభివృద్ధి పనులతో బంగారు తెలంగాణ రూపుదిద్దుకుంటోందన్నారు.