అమిషా-నితీశ్‌ భేటీ

– రెండు సార్లు భేటీ అయిన ఇరువురు నేతలు
– పొత్తు విషయం, సీట్ల పంపకాలపై చర్చ?
పాట్నా, జులై12(జ‌నం సాక్షి) : భాజపా, జేడీయూ మధ్య భేదాభిప్రాయాలు రావటం, బీజేపీపై పలుమార్లు జేడీయూ నేత, బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ఆరోపణలు చేసిన నేపథ్యంలో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా.. నితీశ్‌ కుమార్‌తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అమిత్‌ షా, నితీశ్‌ కుమార్‌ గురువారం భేటీ అయ్యారు. ఈ ఉదయం పట్నాకు చేరుకున్న అమిత్‌షా అక్కడి నుంచి నేరుగా రాష్ట్ర అతిథి గృహానికి వెళ్లి అక్కడ నితీశ్‌కుమార్‌తో అల్పాహార విందులో పాల్గొన్నారు. వీరితో పాటు భాజపా నేత, ఉప ముఖ్యమంత్రి సుశిల్‌ కుమార్‌ మోదీ కూడా ఉన్నారు. అంతేగాక.. గురువారం రాత్రి మరోసారి వీరిద్దరూ భేటీ అయ్యారు. కాగా.. ఈ భేటీలో సీట్ల పంపకాలతో పాటు ఇతర భేదాభిప్రాయాలపై కూడా చర్చిచినట్లు తెలుస్తోంది. 2014 లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఎన్డీయే కూటమి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్రమోదీని ఎన్నుకుంది. దీంతో అసంతృప్తి చెందిన జేడీయూ.. ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి ఆ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో 40 సీట్లకు గానూ.. భాజపా 31 స్థానాల్లో గెలుపొందగా.. జేడీయూకు రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. ఆ తర్వాత జేడీయు-ఆర్జేడీ కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. అయితే ఆ కూటమి రెండేళ్లు కూడా నిలబడలేదు. ఆర్జేడీతో తెగదెంపుల అనంతరం జేడీయూ తిరిగి ఎన్డీయే కూటమిలోకి వచ్చేసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను దృష్టిలో ఉంచుకుని లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీకి మెజార్టీ వాటా ఇవ్వాలని జేడీయూ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యవహారం ఇరు పార్టీల మధ్య విభేదాలకు దారితీసింది. అయితే తాజాగా షా-నితీశ్‌ భేటీ అవడంతో రెండు పార్టీల మధ్య ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోతాయని ఇరు పార్టీల నేతలు భావిస్తున్నారు. ఈ భేటీలో ఇరువురు నేతలు సుధీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో పొత్తుపై, సీట్ల పంపకంపై చర్చ సాగినట్లు తెలుస్తోంది. అదేవిధంగా జమిలి ఎన్నికలపై చర్చించినట్లు
సమాచారం.