అమృత తండ్రిని ఎన్‌కౌంటర్‌ చేయాలి

– సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
న్యూఢిల్లీ, సెప్టెంబర్‌18(జ‌నంసాక్షి) : ప్రణయ్‌ను హత్య చేయించిన అమృత తండ్రిని ఎన్‌కౌంటర్‌ చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కోర్టులు, విచారణ పేరుతో కాలయాపన చేయాల్సిన అవసరం లేదన్నారు. ‘ఈ హత్యలో నయీం అనుచరుల హస్తం ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయని తెలిపారు. నయీం వ్యవహారంపై కేసీఆర్‌ మెతక వైఖరితో ఉన్నందునే ఇవన్నీ జరుగుతున్నాయని అన్నారు. నయీం అనుచరులకు, టీఆర్‌ఎస్‌ నేతలకు సంబంధాలు బయటపడతాయనే నయీం అనుచరులపై చర్యలు తీసుకోలేదని నారాయణ అభిప్రాయపడ్డారు. ఈ కారణంగానే నయీం డైరీ బయటపడినా అందులో విషయాలేవీ ప్రభుత్వం వెల్లడించలేదన్నారు.
ఉత్తరాది  రాష్ట్రాల మాదిరిగా అనంతపురంలోని ప్రబోధానంద స్వామి ఆశ్రమంలో కూడా మారణాయుధాలు సమకూర్చుకున్నారని నారాయణ ఆరోపించారు. ప్రబోధానంద స్వామిని తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. దేవుణ్ణి కూడా బూతులు తిడుతున్నవాడు స్వావిూజి ఎలా అవుతాడు? అని నారాయణ ప్రశ్నించారు.