అమెరికాలో టోర్నడో బీభత్సం – 22 మంది మృతి


– పలువురు గల్లంతు.. అనేక ఇళ్లు ధ్వంసం
బ్యూరీగార్డ్‌, మార్చి4(జ‌నంసాక్షి) : అమెరికాలో టోర్నడో భీభత్సం సృష్టించింది. దీంతో 22 మంది మృత్యువాత పడ్డారు. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో ఈ టోర్నడో బీభత్సం సృష్టిస్తోంది. తుపాను తీవ్రతతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. వందల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. టోర్నడో ధాటికి ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. ఆగ్నేయ అలబామాలో టోర్నడో ప్రభావం ఎక్కువగా ఉంది. ఇళ్లు కూలిపోవడంతో పలువురు గల్లంతయ్యారు. అత్యవసర సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి సహాయకచర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని కాపాడేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటివరకు 22మంది మృతిచెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. కాగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. పలువురు గాయపడగా.. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చెట్లు కూలి రోడ్లపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా కూడా నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. జార్జియా, ఫ్లోరిడా, దక్షిణ కరోలినా ప్రాంతాల్లోనూ టోర్నడో హెచ్చరికలు జారీ చేశారు.