అయిష్టంగానే అణ్వస్త్రదేశంగా భారత్‌

– భద్రత దృష్ట్యా అణ్వస్త్ర దేశంగా మారాల్సి వచ్చింది
– మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి25(ఆర్‌ఎన్‌ఎ) : అణ్వస్త్ర దేశంగా ఉండడానికి భారత్‌ ఎప్పుడూ ఇష్టపడలేదని మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. అణ్వాయుధాల వృద్ధి వల్ల దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందన్నారు. అబ్జర్వర్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌ ఆదివారం విడుదల చేసిన ‘న్యూక్లియర్‌ ఆర్డర్‌ ఇన్‌ ది ట్వంటీ ఫస్ట్‌ సెంచురీ’ అనే పుస్తక ఆవిష్కరణ సభలో ఆయన పాల్గొన్నారు. గతంలో భారత్‌లో శాంతియుత అణు కార్యక్రమాలకు సంబంధించి పటిష్ఠ నిబంధనలు ఉండేవన్నారు. అనంతరం భద్రత దృష్ట్యా అణ్వస్త్ర దేశంగా మారాల్సి వచ్చిందని గుర్తుచేశారు. అణు సామర్థ్యం ఉన్న దేశంగా నిరూపించుకున్నప్పటికీ.. దాదాపు 25 సంవత్సరాల పాటు సంయమనం పాటించామని తెలిపారు. గత అణు ఒప్పందాలను దేశాలు
విస్మరిస్తున్నాయన్నారు. దీంతో అంతర్జాతీయంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయని తెలిపారు. గత 70ఏళ్లలో అణు సాంకేతికత వృద్ధి చెందిందని.. దీంతో ప్రతి దేశం అణ్వస్త్రాలను సమకూర్చుకునే అవకాశం ఏర్పడిందన్నారు. కృతిమ మేథ, సైబర్‌ రంగాల్లో వస్తున్న మార్పులు మరింత అస్థిరతకు దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వీటి పర్యవసానంగా క్లిష్ట సమయాల్లో నేతల నిర్ణయాధికారానికి అవరోధాలు ఏర్పడే ప్రమాదముందన్నారు. చాలా దేశాలు ఆధునిక అణ్వస్త్ర సాంకేతికతను అందిపుచ్చుకుంటున్న నేపథ్యంలో వాటిని ఉపయోగించే అవకాశాలు కూడా పెరిగాయన్నారు.