అరుణ్‌జైట్లీ కన్నుమూత

-గత కొన్ని రోజులుగా వెంటిలేటర్‌పైనే చికిత్స

– అనారోగ్యంతో చికిత్స పొందుతూ కన్నుమూత
– కొంతకాలంగా ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న జైట్లీ
– జైట్లీ మృతితో శోకసంద్రంలో బీజేపీ శ్రేణులు
– మంచి స్నేహితుడ్ని కోల్పాయానన్న ప్రధాని మోదీ
– సంతాపం తెలిపిన తెలుగు రాష్టాల్ర సీఎంలు
న్యూఢిల్లీ, ఆగస్టు24 (జనంసాక్షి): కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అరుణ్‌ జైట్లీ అనారోగ్యం కారణంగా శనివారం ఢిల్లీ ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచారు. ఆగష్టు 9న ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు ఆయన్ను ఎయిమ్స్‌లో చేర్పించారు. 15 రోజులపాటు చికిత్స పొందిన ఆయన.. ఆరోగ్యం విషమించడంతో శనివారం తుదిశ్వాస విడిచారు. జైట్లీ ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు శతథా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. జైట్లీ ఎయిమ్స్‌లో చేరిన రోజే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌ షా, హర్షవర్దన్‌, రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ తదితరులు ఎయిమ్స్‌కు వెళ్లి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. డయాబెటిస్‌ కారణంగా బాగా బరువు పెరిగిపోయిన జైట్లీ 2014లో బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నారు. 66 ఏళ్ల జైట్లీ గత ఏడాది కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చేయించుకున్నారు. ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఆయన.. ఈ ఏడాది జనవరిలో రెగ్యులర్‌ మెడికల్‌ చెకప్‌ కోసం అమెరికా వెళ్లారు. దీంతో బ్జడెట్‌ను పియూష్‌ గోయల్‌ ప్రవేశపెట్టారు. వృత్తిరీత్యా లాయర్‌ అయిన జైట్లీ ప్రధాని తొలి కేబినెట్లో కీలక మంత్రిగా, ట్రబుల్‌ షూటర్‌గా వ్యవహరించారు. ఆయనకు క్యాన్సర్‌ రావడంతోనే చికిత్స కోసం జనవరిలో అమెరికా వెళ్లారని ప్రచారం జరిగింది. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో జైట్లీ పోటీ చేయలేదు. అనారోగ్యం కారణంగా బాధ్యతలు తీసుకోవడానికి తాను సిద్ధంగా లేనని ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రధాని మోదీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. గతంలో మృత్‌సర్‌ నుంచి అరుణ్‌ జైట్లీ పోటీ చేస్తున్నారనే విషయం తెలియగానే ఆ నియోజకవర్గంలో దాదాపు 40 భాజపా కార్యాలయాలు స్వచ్ఛందంగా తెరుచుకున్నాయి. అవన్నీ ఆయన బంధువులు, మిత్రులు నివసించే ఇళ్లే. వారంతా జైట్లీ గెలుపు తమ సొంత పని అయినట్లు అ¬రాత్రులు కష్టపడ్డారు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అంశం ఉంది.. జైట్లీ కోసం ప్రచారానికి వచ్చిన డాక్టర్లు, ఇంజినీర్లలో అత్యధికులు ఆయన విూద ప్రేమతో వచ్చినవారే. వారంతా ఆయన చలువతోనే విద్యాభ్యాసం పూర్తి చేసి మంచి జీవితంలో స్థిరపడ్డారు. అరుణ్‌ జైట్లీలో పైకి కనిపించే గాంభీర్యం మాటున ఒక మంచి మనసు దాగి ఉంది. మనసున్న మారాజుగా జైట్లీని సన్నిహితులు  అభివర్ణిస్తుంటారు.
లా¬ర్‌ నుంచి అమృత్‌సర్‌కు..
అరుణ్‌ జైట్లీ 1952లో మహారాజ్‌ కిషన్‌ జైట్లీ, రతన్‌ ప్రభు దంపతులకు ఢిల్లీలో జన్మించారు. తండ్రి కిషన్‌ స్వస్థలం ప్రస్తుత పాకిస్థాన్‌లోని లా¬ర్‌. ఆయన అక్కడ పేరు ప్రఖ్యాతులు కలిగిన న్యాయవాది. తల్లి రతన్‌ ప్రభుది పంజాబ్‌లోని అమృత్‌సర్‌. దేశవిభజన సమయంలో కిషన్‌ జైట్లీ ఢిల్లీకి నారాయణ్‌ విహార్‌కు వచ్చి ప్రాక్టీస్‌ ప్రారంభించారు. అక్కడే అరుణ్‌జైట్లీ జన్మించారు.  జైట్లీ విద్యాభ్యాసం మొత్తం మంచి పేరున్న విద్యాలయాల్లోనే జరిగింది. సెయింట్‌ జేవియర్‌ స్కూల్‌, శ్రీరామ్‌ కామర్స్‌ కాలేజ్‌, లా విద్యాభ్యాసం ఢిల్లీ యూనివర్సిటీల్లో చదివారు. ఢిల్లీలోని అత్యంత ప్రముఖ న్యాయవాదుల్లో జైట్లీ కూడా ఒకరు. పన్ను చట్టాలు, ఆర్థిక వ్యవహారాలు ఆయనకు కొట్టిన పిండి. కోర్టులో ప్రత్యర్థులకు చుక్కలు చూపించేవారని పేరు. కానీ,
తన గుమాస్తాల విషయంలో మాత్రం జైట్లీ ఎంతో ఉదారంగా ఉండేవారు. ప్రతి కేసులోను ప్లీడర్‌ గుమాస్తాలకు ఇచ్చే ఖర్చులను నేరుగా వారికే ఇప్పించేవారు. దీంతో పాటు వారి సిబ్బంది పిల్లల చదువులకు అవసరమైనప్పుడల్లా ఆర్థిక సాయం చేసేవారు. సిబ్బంది పిల్లల పెళ్లిళ్లకు ఢిల్లీలోని ఇంటిని వేదికగా చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఇందిరా గాంధీపై పోరాటం..
జైట్లీ తొలి అరెస్టు ఎమర్జెన్సీ సమయంలో జరిగింది. ఆయన లా విద్యను అభ్యసిస్తున్న సమయంలో అప్పటి దేశ ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారు. దీంతో విద్యార్థి నాయకుడైన జైట్లీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యమించారు. ఫలితంగా ఆయన్ను విూసా చట్టం కింద అరెస్టు చేసి జైల్లో వేశారు. 19నెలలు జైల్లోనే గడిపారు. దీంతో ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోయారు. జైలు నుంచి రాగానే  ఏబీవీపీలో చేరి ఢిల్లీ విభాగం అధిపతిగా, ఆల్‌ ఇండియా విభాగానికి జనరల్‌ సెక్రటరీగా ఎదిగారు. ఢిల్లీలోని ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ భవనాన్ని ఇందిరాగాంధీ ప్రభుత్వం కూల్చివేయాలని నిర్ణయించడంతో దానికి వ్యతిరేకంగా జైట్లీ పోరాడారు. అప్పుడే ఆయనకు న్యాయ కోవిదులు ఫాలీనారిమన్‌, ఎస్‌.గురుమూర్తి, ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ అధిపతి రామ్‌నాథ్‌ గోయంకాలతో  పరిచయం ఏర్పడింది.  1987లో ఢిల్లీలో న్యాయవాదిగా ప్రాక్టిస్‌ ప్రారంభించిన జైట్లీని ఆ తర్వాత రెండేళ్లకే వీపీ సింగ్‌ ప్రభుత్వం అదనపు సోలిసిటర్‌ జనరల్‌గా 1989లో నియమించింది.  బోఫోర్స్‌ కేసుకు సంబంధించిన పేపర్‌ వర్క్‌ మొత్తం జైట్లీనే చేశారు.
వాజ్‌పేయి కేబినెట్‌లో మంత్రిగా..
1999లో వాజ్‌పేయి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు తొలిసారి మంత్రిగా ఆయన పెట్టుబడుల ఉపసంహరణ శాఖను చేపట్టారు. ఆ శాఖను ప్రారంభించడం అదే తొలిసారి. న్యాయకోవిదుడైన రాంజెఠ్మలనీ ఆ శాఖకు రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలు కూడా జైట్లీనే స్వీకరించారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల చట్టం రూపకల్పనలో జైట్లీనే కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత పార్టీ బాధ్యతల కోసం కేబినెట్‌ నుంచి వైదొలగినా.. 2003లో మళ్లీ కామర్స్‌ అండ్‌ లా మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. 2009లో అడ్వాణీ ఆయన్ను రాజ్యసభలో పార్టీ నాయకుడిగా నియమించారు. అనంతరం 2014 ఎన్నికల్లో మోదీ హయాంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆర్థికశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వంలో పలు కమిటీలు ఉంటాయి. అందులో కేబినెట్‌ కమిటీ ఆన్‌ సెక్యూరిటీ (సీసీఎస్‌) ఒకటి. ప్రధాని అధ్యక్షత వహించే ఈ కమిటీలో రక్షణ, ఆర్థిక, ¬ం, విదేశీ వ్యవహారాల శాఖా మంత్రులు మాత్రమే సభ్యులుగా ఉంటారు. మొత్తం నాలుగు శాఖల్లో రెండు శాఖలను చూసేది జైట్లీనే. దీనినిబట్టి మోదీ కేబినెట్‌లో జైట్లీకున్న ప్రాధాన్యం ఏమిటో అర్థమవుతుంది. 2016 మే 26న మోదీ మంత్రివర్గ ప్రమాణస్వీకారం అనంతరం రెండు కీలక శాఖలైన ఆర్థిక, రక్షణను అరుణ్‌జైట్లీకి అప్పగించారు. తర్వాత కొన్నాళ్లకు రక్షణశాఖను మనోహర్‌ పారికర్‌కు అప్పగించినా.. ఆయన గోవా సీఎంగా వెళ్లిన తర్వాత మళ్లీ నిర్మలా సీతారామన్‌ ఆ బాధ్యతలు చేపట్టేవరకు రక్షణ మంత్రిగా జైట్లీ వ్యవహరించారు. మళ్లీ 2019లో రెండవ సారి మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత కేబినెట్‌లో చేరాలని మోదీ కోరడంతో ఆరోగ్యం సహకరించడం లేదని మోదీ వినతిని తిస్కరించారు. అప్పటికే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న జైట్లీ చికిత్స పొందుతూ శనివారం మృతిచెందారు.న
మోదీకి బలమైన మద్దతుదారు..
అరుణ్‌ జైట్లీ నేటి ప్రధాని నరేంద్ర మోదీకి బలమైన మద్దతుదారుగా నిలిచారు. ప్రధాని
అభ్యర్థిత్వంపై పార్టీ సీనియర్‌ నాయకులు పెదవి విరిచినా మోదీకి మద్దతు ఇచ్చారు. అంతేకాదు మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ఎంపిక కూడా జైట్లీ మద్దతుతోనే జరిగింది. అప్పట్లో ఉమాభారతి వ్యతిరేకించినా.. ఆయన చౌహాన్‌కే ఓటు వేశారు. ఆ తర్వాత చౌహాన్‌ మధ్యప్రదేశ్‌లో మూడుసార్లు భాజపాను నిలబెట్టారు. ఇక నోట్ల రద్దు, జీఎస్‌టీ, దివాలా చట్టానికి కోరలు తొడగడంలో జైట్లీ కీలక పాత్రను పోషించారు. భారతీయ జనతా పార్టీలో ఎన్నికల వ్యూహాలు రచించడంలో జైట్లీ దిట్ట. భాజపా అధ్యక్షుడు అమిత్‌షా కన్నా ముందునుంచే  పార్టీకి వ్యూహాలు రూపొందించేవారు. లోక్‌సభ ఎన్నికలైనా, రాష్టాల్రకు జరిగే అసెంబ్లీ ఎన్నికలైనా జైట్లీ పాత్ర ఉండాల్సిందే. భాజపా ప్రధాన కార్యదర్శిగా పార్టీ విజయంలో కీలకపాత్ర పోషించిన ఆయన.. పలు రాష్టాల్రకు ఇన్‌ఛార్జిగా వ్యవహరించారు. ఆయనలాగా రాష్టాల్ర బాధ్యతలు బహుశా మరే భాజపా నేతా చూసుండకపోవచ్చు. ఆయన 2002లో గుజరాత్‌ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా భాజపా ప్రచారబాధ్యతలను చూశారు. మధ్యప్రదేశ్‌, బిహార్‌, కర్ణాటక, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌, దిల్లీ, అసోం, పశ్చిమబెంగాల్‌ వంటి కీలక రాష్టాల్ర అసెంబ్లీ ఎన్నికల బాధ్యతను పార్టీ తరఫున తనపై వేసుకున్నారు. తనదైన వ్యూహాలతో చాలాచోట్ల పార్టీకి విజయం అందించేందుకు కృషిచేశారు.
జైట్లీ మృతికి ప్రముఖుల సంతాపం..
అనారోగ్యంతో కన్నుమూసిన కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతిపట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భాంతి వ్యక్తంచేశారు. ఓ గొప్ప, నిజాయతీ గల నేతను కోల్పోయామంటూ సోషల్‌విూడియా వేదికగా జైట్లీ కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
మంచి స్నేహితుడిని కోల్పోయా – ప్రధాని మోదీ
భాజపా సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్‌ జైట్లీ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ప్రస్తుతం యూఏఈ పర్యటనలో ఉన్న మోదీ.. జైట్లీ మరణవార్త తెలియగానే ఆయన కుటుంబసభ్యులను ఫోన్‌లో పరామర్శించారు. ఆయనతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానంటూ ఆవేదన చెందారు. అరుణ్‌ జైట్లీ రాజకీయ దిగ్గజమని, అత్యున్నత మేధో సంపత్తి గల వ్యక్తి అని కొనియాడారు. దేశం కోసం నిరంతరం సేవ చేసిన నేత. సమాజంలోని అన్ని రంగాల ప్రజలకు ఆయన స్ఫూర్తిదాయకంగా నిలిచారని, భారత రాజ్యాంగం, చరిత్ర, ప్రజా విధానాలు, పాలనా వ్యవహారాలపై సునిశిత విజ్ఞానం ఆయన సొంతమన్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఆయన ఎన్నో మంత్రిత్వ బాధ్యతలు చేపట్టారన్నారు. అలా దేశ ఆర్థిక వృద్ధి, రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసేందుకు సహకారం అందించారని, భాజపాకు, జైట్లీకి విడదీయరాని అనుబంధం ఉందని, విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచే దేశం కోసం పాటుపడ్డారన్నారు.  ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు ఎంతో శ్రమించారని, ఆయన మృతి విచారకరమని, ఓ మంచి స్నేహితుడిని కోల్పోయానని మోదీ సంతాపం తెలిపారు. జైట్లీ భార్య సంగీత, కుమారుడు రోషన్‌తో మోదీ ఫోన్‌లో మాట్లాడారు. ఈ కారణంగా విదేశీ పర్యటనను అర్ధంతరంగా ముగించొద్దని జైట్లీ కుటుంబసభ్యులు మోదీని కోరినట్లు తెలిసింది.
వ్యక్తిగతంగా నాకు పెద్దలోటు – కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షా
అరుణ్‌జైట్లీ మృతి తీవ్రంగా కలచివేస్తోందని, వ్యక్తిగతంగా నాకు పెద్ద లోటు అని కేంద్ర ¬ంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. మా కుటుంబ సభ్యుడినే కోల్పోయినంత బాధగా ఉందని,  నాకు ఎల్లప్పుడూ
మార్గదర్శకంగా నిలిచే వ్యక్తి ఆయన  అన్నారు. అదేవిధంగా రాజ్యసభ్యుడు సీఎం రమేష్‌ జైట్లీ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మృతి విచారకరంమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని, ఓ గొప్ప, నిజాయతీ గల నేతను కోల్పోయామని అన్నారు. బాలీవుడ్‌ నటుడు రితేశ్‌ దేశ్‌ముఖ్‌ జైల్లీ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అన్నారు. జైట్లీ మృతిపట్ల కేంద్ర మంత్రి సురేశ్‌ ప్రభు తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. నా మంచి స్నేహితుడు, గొప్ప రాజకీయ నాయకుడు, అద్భుతమైన పార్లమెంటేరియన్‌ జైట్లీ మరణవార్త విని దిగ్భాంతికి లోనయ్యా అని అన్నారు. ఆయన లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిదని,  ఆయన ఎప్పటికీ మా హృదయాల్లో గుర్తుండిపోతారని సురేశ్‌ ప్రభు పేర్కొన్నారు. అదేవిధంగా రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గె¬్లత్‌ జైట్లీ మృతిపట్ల దిగ్భాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మృతి బాధాకరమని, ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని, ఆయన కుటుంబానికి ఈ పరిస్థితిని తట్టుకునే ధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నామన్నారు. అదేవిధంగా తెలుగు రాష్టాల్ర సీఎంలు జగన్‌మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లు జైట్లీ మృతిపట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు జైట్లీ మృతిపట్ల తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. దేశం గొప్ప నేతను కోల్పోయిందని అన్నారు.