అర్హులైన వారందిరికి అక్రిడేషన్లు: యాదాద్రి భువనగిరి కలెక్టర్‌

యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌9 (జనం సాక్షి):  అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడిటేషన్‌ అందిస్తామని కలెక్టర్‌ అనితారామచంద్రన్‌ అన్నారు. జర్నలిస్టులు తమకు కార్డులు రాలేదని ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. పక్రియ మొత్తం ఆన్‌లైన్‌లో జరుగుతున్నదని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కలెక్టరేట్‌లో అక్రిడిటేషన్‌ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ప్రభుత్వ నిబంధనలకు లోబడి కార్డుల జారీ పక్రియ ఉంటుందని వివరించారు. కార్డులు జారీ చేసే పక్రియను ఆలస్యం చేయవద్దని స్పష్టం చేశారు. జేసీ జీ. రమేశ్‌ మాట్లాడుతూ దసరా పండుగకు ముందు రోజు జర్నలిస్టులకు ఎంతో ఉపయోగకరమైన కార్డులను ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. టీయూడబ్లూజే జిల్లా అధ్యక్షుడు, అక్రిడిటేషన్‌ సభ్యుడు గొట్టిపర్తి భాస్కర్‌ మాట్లాడుతూ కార్డుల జారీ పక్రియను వేగవంతం చేసి త్వరగా అందించినందుకు జర్నలిస్టుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. మండల స్థాయి విలేఖరులకు కూడా త్వరగా కార్డులు అందజేయాలని, తక్షణ అవసరాలు ఉన్న జర్నలిస్టులు కూడా ఉన్నారని కలెక్టర్‌ దృష్టికి తీసుకువచ్చారు.