అవకాశం రాని నేతలకు పెద్దపీట

ఆవేశంతో పార్టీని వీడిపోరాదు

తెలంగాణను విముక్తం చేస్తాం: భట్టి

హైదరాబాద్‌,నవంబర్‌15(జ‌నంసాక్షి): కూటమి ఏర్పాటు ద్వారా పోటీ చేసే అవకాశం రాని నేతలు నిరాశపడవద్దని, వారి త్యాగాలను పార్టీ తప్పకుండా గుర్తిస్తుందని కాంగ్రెస్‌ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కూటమి సర్దుబాట్లలో కొందరికి టిక్కెట్లు రాని మాట వాస్తవమేనని అన్నారు. దీనివల్ల ఇబ్బందులు లేవన్నారు. వచ్చేది కూటమి ప్రభుత్వమని అన్నారు. అలాగే త్యాగం చేసిన వారికే ఎక్కువ

ప్రయోజనం ఉండేలా చూస్తామని అన్నారు. ఆవేవంలో పార్టీని వీడి భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దన్నారు. టికెట్లు రాని వారికి భవిష్యత్తులో న్యాయం చేస్తామని హావిూ ఇచ్చారు. టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం చేయాలనే ఆలోచనతోనే పార్టీ హైకమాండ్‌ ఉందని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త ప్రజాకూటమిని గెలిపించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అభ్యర్థుల ఖరారు పక్రియ తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రచారాన్ని వేగవంతం చేస్తామని భట్టి చెప్పారు. మొత్తం 10 సభలు ఉంటాయని, అందులో ఒక సభకు సోనియా, మిగిలిన వాటికి రాహుల్‌ హాజరవుతారని తెలిపారు. కూటమికి భయపడే టిఆర్‌ఎస్‌ నేతలు ఇష్టం వచ్చినట్లుగా పేలుతున్నారని అన్నారు. వారి సత్తా ఏ పాటిదో ఈ పాటికే ప్రలజకు అర్థం అయ్యిందన్నారు. ఇన్నాళ్లూ ప్రజలను మభ్య పెట్టారని ఇక అది చెల్లదన్నారు. ప్రజలు కెసిఆర్‌ నిజస్వరూపాన్ని గుర్తించారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని ప్రజాకూటమి 75 నుంచి 80 స్థానాల్లో విజయం సాధిస్తుందని భట్టి విక్రమార్క ధీమా వ్యక్తం చేశారు. కూటమిగా అవగాహనతో పోటీచేస్తామని, కలిసి పనిచేసి ఆ నలుగురి నుంచి తెలంగాణను విముక్తి చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు నెలకొన్నాయని, విముక్త తెలంగాణను కోరుకుంటున్నారని అన్నారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో ప్రజాకూటమిగా ఏర్పడ్డామని తెలిపారు. ప్రజాకూటమి దెబ్బకు కేటీఆర్‌ మైండ్‌ బ్లాక్‌ అయిందని వ్యాఖ్యానించారు. అధికారం, సంపద, వనరులను నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజలకు పంచడమే కూటమి ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణను ఆ నలుగురి నుంచి విముక్తి చేయడం, సంపద పంచడం ఖాయమన్నారు. నాలుగు గోడల మధ్య ఫాంహౌస్‌లో కూర్చుని వ్యవహారాలు నడిపే వాళ్లం కాదన్నారు. అలాంటి పాలనకు ఇక కాలం చెల్లిందన్నారు.