అసంపూర్తిగానే కాకతీయ పనులు?

వరంగల్‌,జూన్‌20(జ‌నం సాక్షి): వర్షాకాలం వచ్చినా మిషన్‌ కకాతీయ పనులు అసంపూర్తిగానే ఉన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అట్టహాసంగా వీటిని ప్రారంభించినా పూర్తి చేయడంలో నిర్లక్ష్యం వహించారు. ఈ నేపథ్యంలో గతంలో చేపట్టిన పనులపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 5000కు పైగా జలాశయాలను ఎంపిక చేసింది. ఒకటో దశలో చేపట్టిన పనులు చివరి దశలో ఉన్నాయి. రెండో దశలో ఇంకా చాలా వరకు పూర్తి కావాలి. ఫిబ్రవరిలో మూడో విడతకు సర్కారు రంగం సిద్ధం చేసింది. అయిదు జిల్లాల్లోని చెరువులకు నిధులు మంజూరు చేసింది. పూడికతీతకు వేసవి కాలమే అనుకూలం కావడంతో పనులుచేపట్టారు. పూడిక మట్టిని రైతులు తమ పొలాల్లో పోసుకోవాల్సి ఉంది. వానలు లేనప్పుడే ఇవన్నీ సాఫీగా జరుగుతాయి. అయితేమొదటి దశలో ఉన్న ఉత్సాహం నాలుగోదశకు వచ్చేవరకు కానరాలేదు. ప్రధానంగా ప్రజల భాగస్వామ్యం లేకపోవడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. అధికారులు మొదటి, రెండో దశల్లో చాలా వాటికి హద్దులు నిర్ణయించకుండానే పనులు మొదలు పట్టేశారు. క్రమంలో పెద్ద మొత్తంలో గుత్తేదారులు తమ ఇష్టారీతిన ప్రయివేటు వ్యక్తుల స్థలాల్లోనూ పూడిక తీయడంతో అనేక చోట్ల వివాదాస్పదమైంది. చాలా చోట్ల ఆక్రమణకు గురైన శిఖం భూముల్లోనూ పనులు చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఇదే తీరు మూడో దశలోనూ కొనసాగింది. అందుకే వర్షాకాలం వచ్చినా ఇంకా పనులు అసంపూర్తిగానే మిగిలాయి.