ఆకాశ్ అంబానీ వివాహానికి స్టాలిన్ దంపతులకు ఆహ్వానం
చెన్నై,ఫిబ్రవరి12 జనంసాక్షి): ప్రముఖ వ్యాపారవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు ఆకాశ్ వివాహం త్వరలో జరగబోతోంది. రోజీ బ్లూ డైమండ్స్ అధినేత రస్సెల్ మెహెతా కుమార్తె శ్లోకా మెహతాతో ఆకాశ్ వివాహం జరగనుంది. ఈ నేపథ్యంలో చెన్నైలోని డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్ నివాసానికి అంబానీ దంపతులు వెళ్లారు. స్టాలిన్ దంపతులకు ఆహ్వాన పత్రికను అందించి వివాహ వేడుకకు ఆహ్వానించారు. ఈ విషయాన్ని స్టాలిన్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ‘ముఖేశ్ అంబానీ నుంచి ఆహ్వానం అందినందుకు సంతోషంగా ఉంది’ అని పేర్కొంటూ అంబానీ దంపతులతో కలిసి దిగిన ఫొటోలను పంచుకున్నారు. సోమవారం ముఖేశ్, నీతా దంపతులు ముంబయిలోని ప్రముఖ సిద్ధివినాయక స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. మొదటి శుభలేఖను స్వామి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్చిలో శ్లోకా, ఆకాశ్ వివాహం జరగబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలకు ఆహ్వానం అందినట్లు సమాచారం.