ఆగిఉన్న వాహనాన్ని ఢీకొట్టిన బస్సు

– ఒకరి మృతి.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
నల్గొండ, మే21(జ‌నంసాక్షి) : హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలంలోని పంతంగి టోల్‌ ప్లాజా వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. విజయవాడ నుంచి హైదరాబాద్‌ వైపు వెళుతున్న విజయవాడ డిపోకి చెందిన ఆర్టీసీ సూపర్‌ లగ్జరీ బస్సు పంతంగి టోల్‌ ప్లాజా వద్దకు రాగానే ముందున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన బస్సు డ్రైవర్‌ శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న మరో పది మంది ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ముందున్న వాహన డ్రైవర్‌ అప్రమత్తమై ఘటనా స్థలం నుంచి వాహనం తీసుకొని పరారయ్యాడు. చౌటుప్పల్‌ సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై నవీన్‌ బాబు ఘటనా స్థలికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు టోల్‌ ప్లాజా వద్ద ఉన్న సీసీ టీవీ పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు.—–