ఆటోస్లార్టర్ల తొలగింపుపై క్షేత్రస్థాయి ప్రచారం

జనగామ,డిసెంబర్‌2(జ‌నంసాక్షి): ప్రభుత్వం 24గంటల విద్యుత్‌ సరఫారచేసేముందే ఆటోస్టార్టర్లను రైతులు స్వచ్ఛందంగా తొలగించుకోవాల్సి ఉంటుందని జనగామ విద్యుత్‌శాఖ డీఈ వై రాంబాబు అన్నారు. డిసెంబర్‌ 31 అర్ధరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని వ్యవసాయ పంపుసెట్లకు 24గంటల నిరంతర విద్యుత్‌ను అందించనున్నట్లు ఆయన శనివారం నాడిక్కడ వెల్లడించారు. రైతులు రాత్రి, పగలు ఎప్పుడు అవసరం పడితే అప్పుడే విద్యుత్‌ మోటార్లను ఆన్‌ చేసుకునే వీలున్న దృష్ట్యా ఇక ఆటో స్టార్టర్ల వినియోగం అవసరం ఉండదన్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా చేసినా ఆటోస్టార్టర్లు వాడితే మోటార్లు కాలిపోయి రైతులు నష్టపోవడం జరుగుతందని హెచ్చరించారు. దీంతోపాటు భూగర్భ జలాలు అడుగంటిపోవడమేగాక, కరెంటు భారీగా వృథా అవుతుందన్నారు. నిరంతర విద్యుత్‌ సరఫరా చేస్తున్న సందర్భంలో కూడా ఆటో స్టార్టర్లను తొలగించకుంటే విద్యుత్‌ వృధా కాగలదన్నారు. నీటి వినియోగం పెరిగి భూగర్భ జలాలలు మరింత అడుగంటి పోయే ప్రమాదం ఉందన్నారు.భూగర్భ జలాలను మోటార్ల ద్వారా ఎక్కువగా తోడేయడంతో తక్కువ సమయంలోనే భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయే ప్రమాదం ఉందన్నారు. వీటన్నింటి దృష్ట్యా నిరంతర విద్యుత్‌ అమలు చేస్తున్న డిసెంబర్‌ 31లోపు ఆటో స్టార్టర్లను రైతులు

స్వచ్ఛందంగా తొలగించుకుంటే మంచిదన్నారు. తొలుతు ప్రచారం చేస్తామని, తరవాత చర్యలకు వెనకాడబోమని అన్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ సరఫరా విజయవంతంపై జిల్లాలో ట్రాన్స్‌కో అధికారులు రెండు వారాలు ప్రయోగాత్మక పరిశీలన చేశారు. 24గంటల విద్యుత్‌ను విజయవంతంగా సరఫరా చేసిన ట్రాన్స్‌కో క్షేత్రస్థాయిలో ఎదురైన సమస్యలను గుర్తించింది. అందులో ప్రధానంగా రైతులు తమ వ్యవసాయ క్షేత్రాలు, పొలాల్లో ఏర్పాటు చేసుకున్న ఆటోస్టార్టర్ల వినియోగం విఘాతం కలిగిస్తోందని తేల్చింది. రైతులు తప్పనిసరి ఆటోస్టార్టర్లు తొలగించుకోవాలని సూచిస్తున్న ట్రాన్స్‌కో అధికారుల బృందం దీనిపై గ్రామాల్లో రైతులకు డిసెంబర్‌ నుంచి అవగాహన కల్పించేందుకు సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా నవంబర్‌ 6వ తేదీ నుంచి 17వరకు ప్రయోగాత్మకంగా చేపట్టిన 24గంటల విద్యుత్‌ సరఫరాను

విజయవంతంగా ట్రాన్స్‌కో పరిశీలించింది. అందులో భాగంగానే ఆటోస్టార్టర్ల వాడకాన్ని నిషేధించాలని నిర్ణయించింది.