ఆటో డ్రైవర్లకు పోలీస్ పాఠాలు
ఆదిలాబాద్,మార్చి30(జనంసాక్షి): నిబంధనలు పాటించని డ్రైవర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని స్పెషల్ డ్రైవ్లో భాగంగా పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదాల నివారణ, నిబంధనలపై ఆటోడ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా ముప్కాల్ ఘటన నేపథ్యంలో జిల్లా పోలీసులు ప్రమాదాల నివారణకు స్పెషల్డ్రైవ్ చేపట్టారు. జిల్లాలోని 18 మండలాలతో పాటు జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారుల గుండా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. పరిమితికి మించి ప్రయాణికులను తరలిస్తున్న ఆటో డ్రైవర్లపై శాఖా పరమైన చర్య లు తీసుకుంటున్నారు. డ్రైవర్లపై కేసులు నమోదు చేయడంతో పాటు ఆటోలను సీజ్ చేస్తున్నారు.ప్రతి ఆటో డ్రైవర్ నిబంధనల మేరకే ప్రయాణికులను తరలించాలని ఆదేశిస్తున్నారు. రోడ్లకు ఇరువైపులా వ్యవసాయ బావులను గుర్తించేందుకు ప్రత్యే క బృందాలను ఏర్పాటు చేశారు. డీఎస్పీ కె.నర్సింహారెడ్డి నేతృత్వంలో ఈ బృందం జిల్లా వ్యాప్తంగా పని చేస్తోంది. ప్రమాదకరంగా రోడ్లకు ఇరువైపులా బావులుంటే పూడ్చేసుకోవాలని సంబంధిత రైతులకు తెలియజేస్తున్నారు.