ఆత్మరక్షణ కోసమే కాల్పులు

– దిశ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీకి పోలీసుల నివేదిక
– పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌, సీసీ పుటేజీలు అందజేత
– మరోవైపు దర్యాప్తు వేగవంతంచేసిన సిట్‌ బృందం
హైదరాబాద్‌, డిసెంబర్‌10(జ‌నంసాక్షి) : దిశ అత్యాచారం, హత్య ఘటనపై నేషనల్‌ హ్యూమన్‌రైట్స్‌ కమిషన్‌(ఎన్‌హెచ్‌ఆర్‌సీ)కు సైబరాబాద్‌ పోలీసులు మంగళవారం నివేదిక అందించారు. ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరును ఎన్‌హెచ్‌ఆర్‌సీ సభ్యులు అడిగి తెలుసుకున్నారు. నిందితులు తమపై దాడిచేసిన తీరును పోలీసులు బృందానికి వివరించారు. ఒక్కసారిగా కర్రలతో, రాళ్లతో తమపై దాడిచేసి రివాల్వర్లు లాక్కున్నారన్నారు. కొంతదూరం వెళ్లాక నిందితులు కాల్పులకు తెగబడ్డారని, గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆత్మరక్షణ కోసమే కాల్పులు జరిపామని పోలీసులు వెల్లడించారు. దిశ అపహరణ, అత్యాచారం, మృతదేహం కాల్చివేతపై ఫోరెన్సిక్‌ ఆధారాలతో నివేదిక అందజేశారు. రక్తపు మరకల డీఎన్‌ఏ రిపోర్ట్‌తో పాటు అన్ని నివేదికలు పోలీసులు అందించారు. ఘటనా స్థలంతో పాటు లారీ తిరిగిన సీసీ పుటేజీని, కొత్తూరులో పెట్రోల్‌ కొనుగోలు చేసిన సీసీ పుటేజీలు అందించారు. ఇదిలాఉంటే ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం తమ విచారణను వేగవంతం చేసింది. నాలుగు రోజులుగా హైదరాబాద్‌లోనే ఉన్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ బృందం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను పిలిపించి వివరాలు తెలుసుకుంది. ఆ రోజు అసలేం జరిగింది? నిందితులు ఎలా దాడి చేశారు? పోలీసులు ప్రతిఘటించడానికి ఏం చేశారనే వివరాలు నమోదు చేసుకుంది. ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులను విచారించిన తరువాత.. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ సభ్యులు ఎన్‌కౌంటర్‌కు ముందు గాయపడ్డ పోలీస్‌ అధికారుల దగ్గరికి వెళ్లింది. వారి వాంగ్మూలం కూడా నమోదు చేసింది. వారికి చికిత్స అందిస్తున్న వైద్యుల నుంచి కూడా వివరాలు సేకరించారు ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు. దిశ హత్య నుంచి ఎన్‌కౌంటర్‌ వరకు అన్ని విషయాల్ని రికార్డ్‌ చేసుకున్నారు. అలాగే ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నిందితులకు పంచనామా చేసిన రెవెన్యూ అధికారులను కూడా మానవ హక్కుల కమిషన్‌ ప్రశ్నించింది. పంచనామాలో రాసిన ప్రాథమిక వివరాలపైనా ఆరా తీసింది. ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశానికి వెళ్లిన క్లూస్‌ టీమ్‌.. వివరాలు సేకరించింది. 3ఆ స్కానర్లలో ఎన్‌కౌంటర్‌ జరిగిన స్థలాన్ని చిత్రీకరించింది.
సిట్‌ దర్యాప్తు వేగవంతం..
మరోవైపు దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఏర్పాటైన సిట్‌ కూడా దర్యాప్తు ముమ్మరం చేసింది. సోమవారం రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ సిట్‌ సభ్యులతో సమావేశమయ్యారు. కాగా బుధవారం ఇంటరాగేషన్‌లో భాగంగా ఎన్‌కౌంటర్‌ ప్రదేశాన్ని సిట్‌ బృందం పరిశీలించారు. న్‌కౌంటర్‌కు దారితీసిన పరిస్థితులు, సీన్‌ రీ కన్‌స్టక్షన్ర్‌ చేస్తున్న సమయంలో ఏం జరిగిందనే దానిపై వివరాలు సేకరించారు. ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆధారాలు సేకరించిన అధికారులతో పాటు పంచనామా చేసిన అధికారులను కూడా విచారించారు. షాద్‌నగర్‌ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కూడా పరిశీలించి,  చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌ జరిగిన తీరు… దానికి దారితీసిన పరిస్థితులపై సిట్‌ దర్యాప్తు చేసి కోర్టుకు నివేదిక సమర్పించనుంది.