ఆప్‌కు మద్దతు ప్రకటించిన ప్రకాశ్‌ రాజ్‌

న్యూఢిల్లీ,మే4 (జ‌నంసాక్షి): అరవింద్‌ కేజీవ్రాల్‌ స్థాపించిన ఆమ్‌ ఆద్మీ పార్టీకి ప్రముఖ సినీనటుడు ప్రకాశ్‌ రాజ్‌ మద్దతు ప్రకటించారు. తాను ఆప్‌లో  లేకపోయినప్పటికీ.. ఆ పార్టీ సిద్దాంతాలు మాత్రం తనకు బాగా నచ్చాయని చెప్పారు. దేశంలో ఏ పార్టీ అయినా పాలించడానికి కాకుండా ప్రజలకు సేవ చేసేందుకు అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. దేశంలో రెండు జాతీయ పార్టీల పరిస్థితీ బాగాలేదన్నారు. ప్రజలు ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని చెప్పారు. ప్రధాని మోదీ పూర్తిగా విఫలమయ్యారని.. ఆయనో నటుడిగా మారారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్‌ పార్టీలను ఓడించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోందని అభిప్రాయపడ్డారు. భాజపా సరైన దారిలో వెళ్లట్లేదు గనకే తాను ఆ పార్టీని విమర్శిస్తున్నానని ప్రకాశ్‌ రాజ్‌ చెప్పారు.