ఆప్‌ నుంచి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ పోటీ

న్యూఢిల్లీ, మే4(జ‌నంసాక్షి) : ఆమ్‌ ఆద్మీ పార్టీ నుంచి తొలిసారిగా ట్రాన్స్‌జెండర్‌ లోక్‌సభ ఎన్నికల బరిలో దిగారు. ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ నియోజకవర్గం నుంచి ట్రాన్స్‌జెండర్‌ భవానీనాథ్‌ వాల్మికీ పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ.. సమాజంలో మంచి మార్పు కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు. రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు చాలా పార్టీలతో మాట్లాడానని, కానీ ఏ ఒక్క పార్టీ కూడా తనను చేర్చుకోలేదన్నారు. చివరకు తన ఆలోచనలు, సిద్ధాంతాలు ఆమ్‌ ఆద్మీ పార్టీకి నచ్చడంతో ఆ పార్టీ అధిష్టానం అలహాబాద్‌ స్థానాన్ని తనకు కేటాయించిందని భవానీ తెలిపారు. సమాజంలో మార్పు కోసం కృషి చేస్తానని, ట్రాన్స్‌జెండర్ల హక్కుల కోసం పోరాడుతానని భవానీ చెప్పారు. బీజేపీ తరపున రీటా బహుగుణ జోషి, ఎస్పీ – బీఎస్పీ కూటమి తరపున రాజేంద్ర ప్రతాప్‌ సింగ్‌ బరిలో ఉన్నారు.