ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయి పట్టివేత

నల్లగొండ,అక్టోబర్‌28  (జనంసాక్షి):  ఆర్టీసీ బస్సులో తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఓ వ్యక్తి పెద్ద మొత్తంలో బస్సులో గంజాయి తరలిస్తుండగా తనిఖీల్లో పట్టుబడ్డాడు. నల్లగొండ జిల్లాలోని చిట్యాల వద్ద గంజాయి తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. చిట్యాల వద్ద 65వ నంబర్‌ జాతీయ రహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈ క్రమంలో ఆర్టీసీ బస్సులో గంజాయిని తరలిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 22 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని ఆంధప్రదేశ్‌లోని సీలేరు నుంచి ఆదిలాబాద్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితుడిపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.