ఆసిస్‌తో తొలి టీ20కి..  భారత్‌ జట్టు ప్రకటన 


– కృనాల్‌ పాండ్య, మనీశ్‌ పాండేలకు దక్కని చోటు
బ్రిస్బేన్‌, నవంబర్‌20(జ‌నంసాక్షి) : ఆస్టేల్రియాతో బ్రిస్బేన్‌ వేదికగా బుధవారం జరగనున్న తొలి టీ20 మ్యాచ్‌ కోసం 12మందితో కూడిన భారత జట్టుని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. సెలక్టర్లు రెస్ట్‌ ఇవ్వడంతో ఇటీవల వెస్టిండీస్‌తో ముగిసిన టీ20 సిరీస్‌కి దూరమైన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి.. మళ్లీ తొలి టీ20 కోసం జట్టు పగ్గాలని రోహిత్‌ శర్మ నుంచి అందుకున్నాడు. ఇక ఆల్‌రౌండర్‌ కోటాలో కృనాల్‌ పాండ్య తన స్థానాన్ని నిలబెట్టుకోగా.. వెస్టిండీస్‌తో సిరీస్‌లో నిరాశపరిచిన మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ మనీశ్‌ పాండే, స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌పై వేటు పడింది.
భారత్‌ జట్టు ఇదే…
విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ (వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌ (వికెట్‌ కీపర్‌),
దినేశ్‌ కార్తీక్‌, కృనాల్‌ పాండ్య, కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్‌ప్రీత్‌ బుమ్రా, ఖలీల్‌ అహ్మద్‌, చాహల్‌. ఇదిలాఉంటే పేసర్లకి ఎక్కువగా అనుకూలించే బ్రిస్బేన్‌ పిచ్‌పై మ్యాచ్‌ జరగనుండంతో బుధవారం తుది జట్టు ఎంపికలో ఒక స్పిన్నర్‌పై వేటు పడే అవకాశం ఉంది. కృనాల్‌ పాండ్య ఎడమచేతి వాటం స్పిన్నర్‌ కావడంతో.. కుల్దీప్‌ యాదవ్‌పై వేటు వేస్తారా..? లేదా.. చాహల్‌పైనా అనేది బుధవారం మధ్యాహ్నం 1.20 గంటలకి ప్రారంభంకానున్న మ్యాచ్‌లో తేలనుంది. జట్టు వికెట్‌ కీపర్‌గా రిషబ్‌ పంత్‌ని బీసీసీఐ ప్రకటించినా.. మ్యాచ్‌లో కీపింగ్‌ బాధ్యతలు అందుకునే వరకూ స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌లోనూ ఇలానే రిషబ్‌ పంత్‌ని వికెట్‌ కీపర్‌గా ప్రకటించి.. మ్యాచ్‌లో మాత్రం దినేశ్‌ కార్తీక్‌తో టీమిండియా మేనేజ్‌మెంట్‌ కీపింగ్‌ చేయించింది.