ఆ రెండు పథకాలతో రైతుకు భరోసా

కెసిఆర్‌ నిర్ణయంతో అన్నదాతల్లో ఆనందం

ఇర్కోడ్‌లో రైతుబీమా పత్రాలు అందచేసిన మంత్రి హరీష్‌ రావు

సిద్దిపేట,ఆగస్ట్‌9(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బీమా పథకంతో తెలంగాణ రైతుల్లో ఆత్మస్థైర్యం, ఆత్మ విశ్వాసం నింపామని సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌ రావు స్పష్టం చేశారు. ఇర్కోడలోరైతుబీమా ధృవీకరణ పత్రాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. నిన్న రైతు బంధు, నేడు రైతు బీమా.. ఈ రెండు పథకాలతో సీఎం కేసీఆర్‌ రైతుల జీవితాల్లో భరోసా నింపారని తెలిపారు. దేశంలో తొలిసారిగా సీఎం కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం రైతుబీమా పథకం తీసుకువచ్చారని చెప్పారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టండి అని ఎవరూ కేసీఆర్‌ను అడగలేదు. రైతుల కష్టాలు, బాధలు తెలుసు కాబట్టి ఆయనే స్వయంగా ఈ పథకాన్ని తీసుకువచ్చారని స్పష్టం చేశారు. రైతుబీమాకు అర్హులైన రైతులందరూ ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే వారం రోజుల్లోనే బీమా డబ్బు.. వారి కుటుంబ సభ్యులకు అందుతుందన్నారు. రైతు సంఘటిత శక్తిగా ఎదిగితేనే ప్రగతి దిశగా అడుగులు వేస్తామని మంత్రి హరీష్‌ రావు పేర్కొన్నారు.రైతు బ్రతుకు ఒకప్పుడు కష్టాల కడలిలో ఉండేదని, అందుకే రైతులకు భరోసా ఇచ్చేందుకు రైతుబంధు పథకంతో పాటుగా రైతు బీమా సౌకర్యం కల్పిస్తున్నామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ చెప్పారు. జరగరాని సంఘటన జరిగినప్పుడు రైతు కుటుంబం రోడ్డున పడకుండా ఉండేందుకు రూ.5 లక్షల బీమా అమలు చేస్తున్నామని తెలిపారు. మహిళలు తాగునీటి కోసం రోడ్డు విూదకు రాకుండా ఉండేందుకు మిషన్‌ భగీరథ ద్వారా నల్లా ద్వారా ఇంటింటికి మంచినీరు అందిస్తామన్నారు. పేద ప్రజల కొరకు ప్రత్యేకంగా తెలంగాణకు కంటి వెలుగు అనే ఓ బృహత్తర కార్యక్రమాన్ని ఈ నెల 15 న సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని కరీంనగర్‌లో మంత్రి రాజేందర్‌ తెలిపారు.