ఇంట్లోకి దూసుకెళ్లిన రైలు

ఏథెన్స్‌: గ్రీస్‌లో ఒక రైలు అదుపు తప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో కనీసం ఇద్దరు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఏథెన్స్‌ నుంచి బయల్దేరిన రైలు థెస్సాలోన్కీ పట్టణం వద్ద పట్టాలు తప్పి ఒక ఇంట్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి రెప్పపాటు కాలంలో ఇంటి బాల్కనీ నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్నారు. ఈ రైలు పట్టాలు తప్పటానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఈ రైలులో సుమారు 70 మంది ప్రయాణిస్తున్నారు. కేవలం మూడుగంటల వ్యవధిలో వీరిలో చాలమందిని అధికార వర్గాలు రక్షించాయి. శనివారం అర్ధరాత్రి ఈ ప్రమాదం జరిగింది. గ్రీస్‌లోనే రెండో అతిపెద్ద నగరమైన థెస్సాలోన్కీకి 40 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ దేశ రైల్వే అధికారులు ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తారు.