ఇంతటి అధ్వాన్న పాలన గతంలో ఎప్పుడూ లేదు

ప్రశ్నిస్తే సస్పెన్షన్లు చేసి పక్కదారి పట్టించారు: కాల్వ
అనంపురం,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) :  గతంలో ఎప్పుడూ ఇంత అధ్వాన్న పాలన చూడలేదని మాజీమంత్రి, టిడిపి నేత కాల్వ శ్రీనివాసులు అన్నారు.  ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో ప్రజలపై పన్నులు విధించడం తప్ప ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సమస్యలు చర్చిఏ ధైర్యం కూడా చేయలేక పోయారని అన్నారు. టిడిపి సభ్యులను సస్పెండ్‌ చేయడం మినహా వారు సాధించేదేవిూ లేదన్నారు.  జగన్‌ పాలనలో విద్యుత్‌, కరెంటు, పెట్రో ఛార్జీలు ఎన్నడూ లేని విధంగా విపరీతంగా పెంచారన్నారు. అయితే జగన్‌ సర్కారు నివాస గృహాలకు 0.1 నుంచి 0.5 వరకు, నివాసేతర ప్రాంతాలకు
0.2 నుంచి 2 శాతం వరకు పెంచే విధంగా చట్టాన్ని తీసుకువచ్చారన్నారు. ఆదాయం కోసం ప్రభుత్వం ప్రతి ఏటా రిజిస్టేష్రన్‌ విలువ పెంచుతోందన్నారు. కొత్త పన్నుల విధానం అమల్లోకి తెస్తే ప్రతి ఏటా ఆస్తి పన్ను విలువ పెరుగుతుందన్నారు. చార్జీల పెంపును నిరసిస్తూ శనివారం టీడీపీ ఆధ్వర్యంలో దీక్షలు చేపడుతున్నట్లు వివరించారు. చంద్రబాబుపై రాజకీయ కక్షతో హెరిటేజ్‌, చిన్న చిన్న ప్యారడైజ్‌లను దెబ్బతీసేందుకు ఏడాదికి 500 కోట్లు వడ్డీ కట్టి, 3 వేల కోట్లు అప్పు తెచ్చి అమూల్‌ సంస్థకు మౌలిక వసతులు కల్పిస్తున్నదని ఆరోపించారు. జగన్‌ నిర్ణయం వల్ల చిన్న చిన్న డెయిరీలు దెబ్బతింటున్నా యన్నారు. సమస్యలను  అసెంబ్లీలో ప్రశ్నిస్తే టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేస్తున్నారన్నారు. మంత్రులు  పేర్నినాని, కొడాలినాని సిగ్గు లేకుండా అసభ్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. కరోనా కారణంగా ప్రజాజీవితాలు తలకిందులయ్యాయని, ఇలాంటి పరిస్థితుల్లో పన్ను రద్దు చేయాల్సిందిపోయి పెంచడం దారుణమన్నారు. పన్నుల పెంపును ఉపసంహరించుకునేంత వరకు పోరాటాలు చేస్తామన్నారు.