ఇకపై కేసీఆర్‌ను విమర్శించను! 

తెరాసలో చేరబోను: జగ్గారెడ్డి
సంగారెడ్డి అర్బన్‌, 
ఇకపై తాను సీఎం కేసీఆర్‌, ఆయన కుటుంబసభ్యులు, మంత్రులు ఎవరిపైనా రాజకీయ విమర్శలు చేయనంటూ సంగారెడ్డిలో ఎమ్మెల్యేగా గెలిచిన తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) స్పష్టం చేశారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ..తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కేసీఆర్‌ను అవసరమైతే యాభైసార్లు కలుస్తానని చెప్పారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల కింద ఇస్తున్న మొత్తాన్ని రూ.1.50 లక్షలకు పెంచాలనీ, పెళ్లికి నెలముందే చెక్కు అందించాలని కోరతానన్నారు. గతంలో తెలిసీ తెలియక ఒకట్రెండు తప్పులు చేశానని, ఇకపై ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేకుండా పని చేస్తానన్నారు. సంగారెడ్డి జిల్లాకు కొత్తగా ఎవరు మంత్రిగా వచ్చినా వారి సూచనల మేరకు నడుచుకుంటానని చెప్పారు. తెరాసలో చేరబోనని, కాంగ్రెస్‌ బలోపేతానికి కృషి చేస్తానని స్పష్టం చేశారు.