ఇచ్చిన మాట ప్రకారం గోదావరి జలాలు

డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు: ఎమ్మెల్యే

మహబూబాబాద్‌,నవంబర్‌27 (జనంసాక్షి) :  ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం యాసంగికి సాగునీరు అందిస్తున్నామని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ అన్నారు. పాలేరు వాగుపై ఉన్న చెక్‌డ్యాం గోదావరి జలాలతో నిండి మత్తడి పోస్తున్నదని అన్నారు. చెరువులను గోదావరి జలాలలతో నింపుతున్నామని అన్నారు. సీఎం కేసీఆర్‌తోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3 లక్షల నిరుపేద కుటుంబాలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల కల నెరవేరుతున్నదని అన్నారు. డోర్నకల్‌ నియోజకవర్గానికి ఇప్పటికే 2500 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు మంజూరైనట్లు చెప్పారు. కొన్ని చోట్ల కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో వాటి నిర్మాణాలు అనుకున్న సమయంలో పూర్తి కావడంలేదని తెలిపారు. కుటుంబ సభ్యులంతా ఒకే దగ్గర ఉండేలా సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవ చూపి నిరుపేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను మంజూరు చేసి నిర్మిస్తున్నట్లు చెప్పారు. అంతేకాకుండా సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలు, కరెంట్‌ వసతిని కల్పిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వాలు పక్కా ఇళ్ల నిర్మాణం కోసం రూ.30 వేలు మాత్రమే ఇచ్చే వారని గుర్తు చేశారు. అయితే వాటిని కొందరు నిర్మించుకునేవారు మరి కొందరు అట్లనే వదిలేసిన సంఘటనలను వివరించారు. స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడొద్దని సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఎక్కడా లేని విధంగా డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లను నిర్మించి ఇస్తున్నారన్నారు. వాటిని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు.