ఇటీవలి వర్షాలతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకాలు

లక్ష్యాన్ని దెబ్బతీసిన ఓపెన్‌ కాస్టులు
కొత్తగూడెం,ఆగస్ట్‌20 (జనం సాక్షి)  : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్‌ కాస్టుల్లో మళ్లీ బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో సింగరేణి లక్ష్యాలకు కొంత గండి పడిందని తెలుస్తోంది. ఇటీవల ఎడతెరిపిలేని వర్షాల కారణంగా ఓపెన్‌ కాస్టుల్లో నీరునిండిపోయింది. ఓపెన్‌ కాస్టుల్లో నీరు తోడితే తప్ప ఉత్పత్తికి అవకాశాలు లేకుండా పోయాయి. దీంతొ కొన్ని రోజులపాటు ఉత్పత్తికి విఘాలం కలిగింది. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు గనిలోకి వాన నీరు వచ్చి చేరింది. బొగ్గు వెలికి తీసే కోల్‌బెంచ్‌ నీటిలో పూర్తిగా మునిగిపోయింది. దాంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఓసిలోకి వెళ్లే రహదార్లు బురద మయంగా మారాయి. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వాన తెరపి ఇచ్చిన కొద్ది సమయంలో రోడ్ల విూద ఉన్న బురద, నీటిని తొలగించే పనులు చేస్తున్నారు. కాని ఆ పనులు పూర్తి కాకముందే వానలు తిరిగి అందుకుంటున్నాయి. ఫలితంగా పనులు ఏమాత్రం ముందుకు సాగని పరిస్థితులు నెలకొన్నాయి. గనిలోకి చేరిన నీటిని 190 హెచ్‌పీ సామర్థ్యం గల  మోటార్లతో బయటికి పంపిస్తున్నట్లు ఓసీ ప్రాజెక్టు అధికారులు  తెలిపారు.  ఇదిలా ఉండగా కోల్‌యార్డులో నిల్వ ఉన్న బొగ్గును రవాణా చేస్తున్నామని పేర్కొన్నారు. భారీ వర్షాలు ఇల్లెందు నియోజకవర్గాన్ని ముంచెత్తాయి..  దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. బేతంపూడి ప్రాజెక్టు నిండింది. చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రధాన వాగులైన మస్సివాగు, ముర్రేడువాగు, చల్లవాగు ఉధృతంగా ప్రవహించాయి. వాగువెంట ఉన్న పంట చేలన్నీ జలమయమయ్యాయి.