ఇళ్లు..మంచినీళ్లు ఈ రెండే  సమస్యలు

టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన
నల్లగొండ,మే15(జ‌నంసాక్షి): జిల్లాలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఒక్క నిరుపేదకూ ఇల్లు కట్టించలేకపోయామని టిఆర్‌ఎస్‌ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. ఇంతకాలం ఎన్నికల్లో ఎలాగో నెట్టుకొచ్చినా ఇప్పుడు ఓ వైపు ఇళ్లు, మరోవైపు మంచినీళ్లు తమకు సమస్యగా మారాయని అంటున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ప్రజలకు హావిూలు ఇస్తూ వచ్చినా, ఇకముందు ప్రజల వద్దకు ఎలా వెల్లాలన్న ఆందోళన క్షేత్రస్థాయినేతల్లో మొదలయ్యింది. ఆయా నియోజకవర్గాల్లో ఈ మేరకు నేతలను నిలదీస్తున్నారు. జనాల్లోకి వెళ్లాలంటే ఇబ్బందిగా ఉందని ఇటీవల కొందరు నాయకులు ప్రాఏశిక ఎన్నికల సందర్బంగా  ఆందోళన వెలిబుచ్చారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత పేదలందరికీ రెండు పడకల ఇళ్లు నిర్మిస్తామని హావిూ ఇచ్చినా.. ఇంతవరకు వాటిని కట్టించి ఇవ్వలేదు. అభివృద్ధి జరిగిన చోటే నిర్మిస్తామని చెబుతున్న రెండుపడక గదుల ఇళ్ల నిర్మాణాల్లో.. అడవిలో జీవిస్తున్న ఎస్టీలకు ఏవిధంగా న్యాయం చేస్తారో వివరించాలని  నిలదీశారు. మొదటి విడతలో ఒక్కో నియోజవర్గానికి 400 ఇళ్లను కేటాయించినా ఒక్కటీ పూర్తి చేయలేదని వాపోయారు. లబ్ధిదారుల ఎంపికలో రిజర్వేషన్లు పాటిస్తామని చెబుతున్నా ఎంతవరకు అమలన్నది ఇప్పటికీ ప్రశ్నగానే ఉంది. ఇకపోతే ఎండాకాలంలో గ్రామాల్లో మంచినీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. దీనిపై కూడా నిర్లక్ష్యం కనిపిస్తోందని పలువురు నేతలు, ముఖ్యంగా సర్పంచ్‌లు వాపోయారు. ఆర్‌డబ్ల్యూఎస్‌, విద్యుత్తు సంస్థ అధికారుల సమన్వయ లోపంతో చాలా గ్రామాల్లో ప్రజలు తాగునీటి ఇబ్బందులు పడుతున్నారని పలువురు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గ్రామాల్లో సమన్వంయంతో పోవాలని  పరిష్కారం చెప్పాలని.. తప్పించుకోవాలని చూడొద్దని.. వెంటనే పెండింగ్‌లోని పనులకు ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని సూచించారు. మొత్తంగా ఈ రెండు సమస్యలపై ప్రజల నుంచి ఇబ్బందులు ఎదుర్కొటున్నామని వాపోతున్నారు.