ఈ-నామ్‌ అమలులో చేతివాటం

ఏడాదిగా సక్రమంగా అమలుకాకుండా కొర్రీలు

అయినా చర్యలు తీసుకోని అధికారులు

హైదరాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): జాతీయ మార్కెటింగ్‌ విధానం నామ్‌ పక్కన పెట్టడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. నామ్‌ అమల్లోకి రావడంతో మార్కెట్లలో అమ్మకానికి ఉంచిన పంట ఉత్పత్తులను దేశవ్యాప్తంగా లైసెన్స్‌ ఉన్న వ్యాపారి కొనుగోలు చేసే వీలుంది. పంట ఉత్పత్తుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేయడం వల్ల సరకుకు డిమాండ్‌ ఉంటే రైతులకు ఎక్కువ ధర వచ్చే వీలుంది. పైగా వ్యాపారులు సిండికేట్‌ అయ్యే వీలుండదు. స్థానిక వ్యాపారులు సైతం ఇదే పద్ధతిన కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇబ్బందులు ఏర్పడితే ప్రత్యామ్నాయంగా గతంలో మాదిరిగానే కొనుగోళ్లు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటి వరకు జిల్లాకే పరిమితమైన పంట ఉత్పత్తులను ఇక నుంచి దేశవ్యాప్తంగా అమ్ముకోవచ్చు. అయితే వ్యాపారులు కావాలనే దీనిని దెబ్బతీయడం ద్వారా తమ పెత్తనం కొనసాగించాలని చూస్తున్నారు. అందుకే గతేడాది కాలంగా ఇది సక్రమంగా అమలు కావడం లేదు. సర్వర్‌ పనిచయడం లేదనో మరే ఇతర కారణమో చూపి పక్కన పెడుతూ వచ్చారు. ఈ విధానంలో క్రయవిక్రయాలు మార్కెట్‌ అధికారుల పర్యవేక్షణలో జరుగుతుండటం వల్ల రైతులు మోసపోయే అవకాశం ఉండదు. పంట ఉత్పత్తుల కొనుగోలు అనేది ఇప్పటి వరకు స్థానిక వ్యాపారులపైనే ఆధారపడి ఉంది. ఈ విధానం వల్ల రైతుల సరుకు నచ్చితే, భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఏ వ్యాపారైనా కొనుగోలుకు ముందుకు వచ్చే వీలుంది. ప్రతిది ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి రావడంతో జీరో అమ్మకాలు తగ్గిపోతాయి. రైతులకు సంగణకం ద్వారా తక్‌పట్టీలు ఇవ్వడం వల్ల నిర్ణయించిన ధరనే రైతులకు ఇవ్వాల్సి వస్తుంది. /ూష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ మార్కెటింగ్‌ విధానంతో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరిపేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ విధానంపై రైతులు, వ్యాపారులకు అవగాహన కలిగించారు. కొన్ని రోజులుగా సర్వర్‌ వల్ల ఇబ్బందులు ఏర్పడటంతో పాత పద ధతిలోనే ఆయా మార్కెట్లలో కొనుగోళ్లు నిర్వహిస్తున్నారు. ఇబ్బందులు తొలగిపోతే నూతన విధానంతో క్రమవిక్రయాలు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. మార్కెట్‌ యార్డుకు రైతు పంటను తీసుకురాగానే రైతు పేరు, ఫోన్‌ నెంబరు, పంట ఉత్పత్తుల వివరాలు, వాటి నాణ్యత, ఎంత మొత్తం, లాట్‌ నెంబర్‌, మద్దతు ధర, అంచనా ధరలు తదితర వివరాలు సంగణకంలో నమోదు చేస్తారు. దీంతో ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ చేసేందుకు లైసెన్స్‌ ఉన్న వ్యాపారులు ఎవరైనా, ఎక్కడి నుంచైనా సరకును కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఒక్కో వ్యాపారి ఒక్కో ధర కోట్‌ చేస్తారు. నిర్ణీత సమయంలో ఏ వ్యాపారి సరకుకు ఎక్కువ ధర వేస్తే.. అది ఖరారు చేస్తూ రైతుల సమాచారం అందుతుంది. రైతు ఆ ధరకు పంటను అమ్ముకోవడానికి అంగీకరిస్తే, నేరుగా డబ్బులు ఆయన ఖాతాలో జమవుతాయి. ఆన్‌లైన్‌లో సరకులు కొనుగోలు చేసే వ్యాపారులు ఏ మేరకు లావాదేవీలు జరుపుతారో అంత మొత్తం నగదు మార్కెట్‌ కార్యాలయంలో డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. స్థానిక అధికారుల సహాయంతో లేదా తమకు సంబంధించిన వారితో తూకం తదితర వాటిని పూర్తి చేసుకుని వ్యాపారులు సరకును తీసుకెళ్తారు.