ఈ నెల 31వరకు లాక్‌ డౌన్‌: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : ఈ నెల (మార్చి) 31 వరకు తెలంగాణ లాక్‌ డౌన్‌లో  ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ (కోవిడ్‌-19) వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జనతా కర్ఫ్యూకు ప్రజలు స్పందించారు. ఈ సమావేశమనంతరం ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో సీఎం మాట్లాడుతూ..ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన పిలుపుమేరకు జనతా కర్ఫ్యూలో పాల్గొని తెలంగాణ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలిచారని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. దేన్నయిన ఎదుర్కోగలం అనే సంఘీభావం ప్రకటించారన్నారు. ప్రజలంతా ఇప్పటివరకు ఎలా క్రమశిక్షణతో ఉన్నారో..మార్చి 31వరకు ఇంటి దగ్గరే ఉండాలని  సీఎం కేసీఆర్‌ సూచించారు. ఏ ప్రదేశంలో కూడా ఐదుగురికి మించి గుమికూడవద్దన్నారు. ఎవరి ఇండ్లకు వారు పరిమితం కావాలని సీఎం రాష్ట్ర ప్రజలకు సూచించారు. ప్రజలకు నిత్యావసరవస్తువుల విషయంలో ఇబ్బంది లేకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు. ఇంటికి కావాల్సిన పాలు, కూరగాయలు, ఇతర సరుకులు తీసుకువచ్చేందుకు..ఆ ఇంటిలోని ఒక్క వ్యక్తికి మాత్రమే బయటకు వెళ్లే అనుమతివ్వడం జరుగుతుందని సీఎం పేర్కొన్నారు. తెల్లరేషన్‌ కార్డుదారులందరికీ ప్రతీ ఇంట్లో ఒక్కొక్కరి 12 కిలోల చొప్పున నెలకు సరిపడా బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేస్తామని సీఎం కేసీఆర్‌ చెప్పారు. బియ్యంతోపాటు ఇతర సరుకుల కొనుగోలు కోసం రూ.1500 నగదు అందజేస్తమన్నారు.  మార్చి 31వరకు తెలంగాణవ్యాప్తంగా  ప్రజా రవాణా బంద్‌ ఉంటుందని, ఆటోలు, బస్సులు, ప్రైవేట్‌ వాహనాలు బంద్‌ ఉంటయన్నారు.