ఉగాది రోజున డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రవేశం

-పనులు వేగిరం చేయాలన్న కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి
సిద్దిపేట,నవంబర్‌ 2(జ‌నంసాక్షి): తెలంగాణా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాలను వేగంగా పూర్తి చేయాలని వచ్చే ఉగాది రోజున గృహప్రవేశం నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అధికారులను జిల్లాకలెక్టర్‌ పి.వెంకట్రామిరెడ్డి ఆదేశించారు. గురువారం ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని నర్సాపూర్‌ ప్రాంతంలో పైలట్‌ ప్రాజెక్టు కింద జి ప్లస్‌ టూ డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ ప్రగతిని కలెక్టర్‌ పరిశీలించారు. ఇటీవల కవిూషనరేట్‌, ప్రభుత్వ వైద్య కళాశాల, కలెక్టరేట్‌ నిర్మాణ తరహాలోనే నర్సాపూర్‌లో ఇల్ల నిర్మాణం జరగుతుందని పనులు భేష్‌గ్గా ఉన్నాయని కలెక్టర్‌ అధికారులకు కితాబిచ్చారు. మంత్రి హరీష్‌రావు ఎప్పటికప్పుడు సవిూక్షలు నిర్వహిస్తూ అధికారులు, కాంట్రాక్టర్లలో ఉత్సాహాన్ని పెంచేందుకు ప్రయత్నించడమేకాక, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారన్నారు.  7 నెలల క్రిందట ప్రారంభమైన జీ ప్లస్‌ టూ డబుల్‌ బెడ్‌రూం ఇల్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు. జిల్లాలో అర్బన్‌, సెవిూ అర్బన్‌లో జీ ప్లస్‌ 1, ప్లస్‌ 2ల నిర్మాణానికి సీఎం కేసీఆర్‌ సూచనల మేరకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఆయా ప్రాంతాల్లో మరి కొంత స్థల సేకరణ చేపట్టి మరిన్ని డబుల్‌ బెడ్‌ రూంఇల్లు నిర్మించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు కార్యాచరణను సర్వే యర్లతో, ఆయా ప్రాంతాల వాసులతో కలెక్టర్‌ చర్చించారు. ఈకార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ పద్మాకర్‌, సిద్దిపేట ఆర్డీఓ ముత్యం రెడ్డి, తహశీల్దార్‌ పరమేశ్వర్‌, మున్సిపల్‌ చైర్‌మన్‌ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.