ఉద్యమకారులకు టిఆర్‌ఎస్‌ గుర్తింపు: ఎమ్మెల్యే

వరగంల్‌,అక్టోబర్‌16(జ‌నంసాక్షి):  సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న వారందరినీ గుర్తించి వారికి సముచిత గౌరవాన్ని ఇస్తున్నారని మాజీ  ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు.  తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ నేతలందరికీ నామినేటేడ్‌ పదవులతో సీఎం కేసీఆర్‌ గౌరవించారని  అన్నారు. రాష్ట్రంలోని అనేకమంది తెలంగాణ ఉద్యమకారులకు ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా, రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్‌ల స్థాయిని చేకూర్చారన్నారు. తాను కూడా ఉద్యమ కారుడిగా ఉండటం వల్లే ఎమ్మెల్యే పదవి లభించిందన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషికి ప్రతీఒక్కరూ చేయూతనివ్వాలన్నారు. మైనార్టీల సంక్షేమం సీఎం కేసీఆర్‌ సారథ్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. గత ప్రభుత్వాలు మైనార్టీలను పూర్తిగా నిర్లక్ష్యానికి గురిచేశాయన్నారు. రానున్న రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు.   సీఎం కేసీఆర్‌ సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌ రాష్ట్రంగా రూపుదాలుస్తోందన్నారు. మరోమారు గెలిపిస్తే లక్ష్యసాధనలో ముందుకు సాగగలమని అన్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం చేపట్టిన డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు, మిషన్‌ భగీరథ, నిరుపేద విద్యార్థులకు మోడల్‌ స్కూళ్ల ఏర్పాటు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలు ఎంతో ఖ్యాతిని పొందాయని అన్నారు.