ఉద్యాన పంటలపై దృష్టి పెట్టాలి

వరంగల్‌,జనవరి30(జ‌నంసాక్షి): ఉద్యాన పంటలతో రైతులకు అధిక ఆదాయం వస్తుందని, అందుకే రైతులందరూ ఆయా పంటల వైపు దృష్టిసారించాలని ఉద్యానశాఖ పీడీ అన్నారు. ఉద్యాన పంటల ద్వారా రైతులు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉండదని, కచ్చితంగా రైతులకు ఆదాయం వస్తుందన్నారు. అధికారులే రైతు భూమిని పరిశీలించి, పరీక్షలు చేసి, అందులో ఏ పంటలను సాగు చేయాలో, ఎంత ఖర్చు వస్తుందో ముందే అవగాహన కల్పిస్తారని, కాకపోతే రైతులు అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం అనేక రకాలుగా సబ్సిడీలను అందిస్తుందన్నారు. ప్రస్తుతం యాసంగి సీజన్‌లో రైతులు ఉద్యాన పంటల వైపు మొగ్గు చూపాలని, వివరాల కోసం స్థానిక ఉద్యాన అధికారులను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా ఎంతదిగుబడి వస్తుందని రైతులను అడిగి తెలుసుకున్నారు. వరి, మిర్చి పంటలను నమ్ముకుని, వాటిని సాగు చేస్తూ రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రసాయనిక ఎరువుల రహిత పంటను పండించడం ద్వారా ఊహించిన దానికంటే అద్భుతమైన ఫలితం వచ్చిందని, తద్వారా రైతు మరింతగా లాభం పొందే అవకాశం ఉందన్నారు. ఇలాంటి పంటలను రైతులు సాగు చేసుకుని ఆదాయాన్ని గడించాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. ఉద్యాన పంటల సాగుకు ఎకరాలు అవసరం లేదని, కనీసం 20 కుంటల వ్యవసాయ భూమి, నీటి వసతి ఉంటే చాలన్నారు.