ఉద్యోగులకు తీపి కబురు

– డీఏ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం

– ఇకపై ప్రతి ఏటా దసరా మరుసటిరోజు సెలవు

హైదరాబాద్‌,అక్టోబరు 23(జనంసాక్షి): రాష్ట్ర వార్షిక బడ్జెట్‌పై మధ్యంతర సవిూక్ష చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. కరోనా కారణంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం, కేంద్రం నుంచి రావాల్సిన నిధులు భారీగా తగ్గినందున మధ్యంతర సవిూక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కరోనా నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం భారీగా తగ్గిందని.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కూడా కోత పడిందని చెప్పారు. కేంద్ర జీడీపీ భారీగా పడిపోయిందని.. ఆ ప్రభావం రాష్ట్రాలపై పడుతుందన్నారు. ఈ పరిస్థితుల్లో వాస్తవంగా ఏ మేరకు నిధులు అందుబాటులో ఉంటాయో.. ఏయే శాఖలకు ఎన్ని నిధులు విడుదల చేసే వెసులుబాటు ఉంటుందో అంచనా వేయాల్సిన అవసరం ఉందని కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం బడ్జెట్‌పై సవిూక్ష నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానం, బడ్జెట్‌ మధ్యంతర సవిూక్ష, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు తదితర అంశాలపై సంబంధిత మంత్రులు, సీఎస్‌, ఆ శాఖ ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్‌ సవిూక్షించారు.

ప్రభుత్వ ఉద్యోగుల డీఏ పెంపు.. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2019 జులై నుంచి రావాల్సిన ఒక డీఏను వెంటనే విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. ఈ మేరకు ఉద్యోగులకు 5.25 శాతం మేర డీఏని పెంచినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 33.53 శాతం నుంచి 38.77 శాతానికి పెంచింది. మూల వేతనంపై పెరిగిన డీఏ 2019 జులై 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న డీఏ విషయంలో అనుసరిస్తున్న విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా కేసీఆర్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం అంచనాలు తయారు చేసి డీఏ నిర్ణయించే విషయంలో జాప్యం జరుగుతోందని.. ఫలితంగా బకాయిలు పేరుకుపోతున్నాయని తెలిపారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన మూడు డీఏల్లో రెండింటి విషయంలో కేంద్రం నిర్ణయాన్ని ప్రకటించాల్సి ఉందన్నారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెల్లించాల్సిన డీఏను రాష్ట్రంలోనే నిర్ణయించాలని.. ఈ విషయమై వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

దసరా మరుసటి రోజు సెలవు..

రాష్ట్ర ప్రభుత్వం దసరా మరుసటి రోజైన 26వ తేదీన సెలవుగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాధారణంగా రాష్ట్రంలో ప్రతి ఏటా దసరా రోజున సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. ఈ విషయంలో మార్పులు తీసుకొస్తూ ఇకపై దసరా పండగ మరుసటి రోజును సెలవు దినంగా ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్‌ రూపొందించాలని అధికా రులను కేసీఆర్‌ ఆదేశించారు.