ఉల్లి ఘాటుకు కారణమెవ్వరు? 

ధరల దాడి సామాన్యులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గతంలో ఎప్పుడూ లేనంతగా కూరగాయలత ధరలతో పాటు నిత్యావసరాల ధరలు మోత మోగిస్తున్నాయి. ప్రధానంగా ఉల్లి ధరల ఘాటుతో సామాన్యుఉల విలవిల్లాడుతున్నారు. సాధారణ మార్కెట్లో దరలు కిలో 60కి అమ్ముతున్నారు. ఇక ఉప్పులు,ప్పులు, నూనెల దరలు చెప్పక్కర్లేదు. ఉల్లి సవిూప భవిష్యత్తులో రూ.వందకు చేరినా ఆశ్చర్యం లేదన్న ఆందోళనలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి. దీనికితోడు అల్లం వెల్లుల్లి, కారం,చింతపండు ధరలు కూడా  అదే స్థాయిలో పెరుగుతున్నాయి. దసరా పండుగకు ముందు ధరల మోత సామాన్యులకు కళ్లు బైర్లు కమ్మేలా చేస్తున్నాయి. ఒక వైపు పంట పండించిన రైతులకు సరైన ధర పడక కన్నీరు పెట్టిస్తుండగా మరో వైపు బహిరంగ మార్కెట్‌లో వినియోగదారులకు రేటు ఘాటెక్కిస్తోంది. ఇటీవలికాలంలో ఇలాంటి వైపరీత్యం తరచూ ఎదురవుతోంది. దేశ వ్యాప్తంగా ఉల్లి ధరలు అమాంతం కొండెక్కాయి. కిలో రూ.50-60కి ఎగబాకింది. ధరలపై తొలుత ఉలుకు పలుకు లేని కేంద్రం, ప్రజల నుంచి రోజురోజుకు పెరుగుతున్న నిరసనల దరిమిలా కొన్ని ఉపశమన చర్యలను ప్రకటించింది.  తొలుత ఎగుమతుల ధరను పెంచగా ఏ మాత్రం ఫలితం కనిపించలేదు. దీంతో ఆదివారం నుంచి ఎగుమతులను పూర్తిగా నిలిపేసింది. దేశీయంగా నిల్వలపై ఆంక్షలు విధించింది. ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం నాలుగైదు రోజుల క్రితం స్పందించింది. కిలో రూ.25 చొప్పున రైతు బజార్లలో అమ్మిస్తామంది. మచ్చుకు కొన్ని పెద్ద పెద్ద రైతు బజార్లలో అమ్మకాలు మొదలైనప్పటికీ ఒక్కొక్కరికి ఒక్క కిలో మాత్రమే, అదీ కొద్ది పరిమాణంలోనే సరఫరా చేస్తుండటంతో చాలా చోట్ల ప్రజలు కిలో ఉల్లిపాయల కోసం గంటల కొలది క్యూలైన్లలో నిరీక్షించాల్సిన విపత్కర పరిస్థితి ఎదురవుతోంది. రైతుల ఉత్పత్తులను ప్రభుత్వం కొనకుండా నగదు బదిలీ రూపంలో ఎంతోకొంత ఇచ్చి చేతులు దులుపుకునే ధోరణిని పైన మోడీ సర్కారు కింద రాష్ట్ర ప్రభుత్వాలు పాదుకొల్పుతుండటంతో రైతులు, వినియోగదార్లు ఇద్దరూ నష్టపోతున్నారు. వ్యాపారులు, దళారులు జేబులు నింపుకుంటున్నారు. దీంతో ధరలతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఉల్లి ధర వందరూపాయలకు చేరుకుంటుందని వ్యాపారులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. దీంతో కొనుగోళ్లు పెంచుకుంటున్నారు. ఇది నిజమన్నట్లుగా గత నాలుగైదు రోజులుగా కిలోకు ఐదు రూపాయల చొప్పున పెరుగుతోంది. ఇటీవల 25 రూపాయలు ఉన్న ధరలు ఏకంగా 60కి చేరుకుంది.  మార్కెట్‌లోకి వస్తున్న కొద్దిపాటి ఉల్లి ఆయా రాష్టాల్ర అవసరాలకే సరిపోతుండగా మిగతా వాటి కోసం దక్షిణాది రాష్టాల్రు పోటీ పడుతున్నాయి. ఫలితంగా డిమాండ్‌ పెరగడంతో ధరలు  కూడా అమాంతం పెరుగుతున్నాయి. 2, 3 రోజుల కిందటి వరకు హైదరాబాద్‌ మార్కెట్‌లకు క్వింటాల్‌కు రూ. 2 వేల మేర పలికిన ధర ఏకంగా పెరిగింది. గతేడాదితో పోలిస్తే మార్కెట్‌లకు 45 వేల క్వింటాళ్ల మేర సరఫరా తగ్గిపోయింది. మరోవైపు కర్నూలు జిల్లాలో సైతం మార్కెట్‌లోకి ఉల్లి అంతగా రావడం లేదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఉల్లి సాగు అనుకున్నంత జరగకపోవడంతో  అవసరమైన సరఫరా లేక ధర పెరుగుతోంది. హైదరాబాద్‌ బహిరంగ మార్కెట్‌లో పది రోజుల కింద కిలో ఉల్లి రూ. 30 మేర ఉండగా ప్రస్తుతం రూ. .60కి చేరింది. ఇది మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెటింగ్‌ వర్గాలు అంటున్నాయి. పొరుగు రాష్టాల్ల్రో  ఇటీవలి వర్షాలు, వరదల కారణంగా దిగుబడి తగ్గడంతో ధర కొండెక్కుతోంది. కేవలం పది రోజుల వ్యవధిలోనే కిలో ఉల్లి ధర రూ. 10 నుంచి రూ. 15 మేర పెరిగింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో రూ. 42 నుంచి రూ. 45 పలుకుతుండగా ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలో ప్రధానంగా ఉల్లి సాగు గద్వాల, వనపర్తి, మహబూబ్‌నగర్‌,
సంగారెడ్డి, మెదక్‌, రంగారెడ్డి, వికారాబాద్‌, కొంతమేర కామారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో సాగవుతుంది. ఈ ఏడాది ఆలస్యంగా కురిసిన వర్షాలు, భూగర్భ జలాల్లో భారీ తగ్గుదల కారణంగా 5,465 హెక్లార్లలోనే సాగైంది. దీంతో రాష్ట్రం నుంచి వస్తున్న ఉల్లితో పూర్తిస్థాయిలో అవసరాలు తీరే అవకాశం లేకపోవడంతో పొరుగు రాష్టాల్రపై ఆధారపడాల్సి వస్తోంది. సాధారణంగా రాష్ట్ర మార్కెట్‌లకు మహారాష్ట్రలోని షోలాపూర్‌, ఔరంగాబాద్‌, నాసిక్‌, కర్ణాటకలోని శివమొగ్గ, రాయచూర్‌ ప్రాంతాలు, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌ నుంచి దిగుమతులు ఉంటాయి. అలాగే ఏపీలోని కర్నూలు నుంచి కూడా ఉల్లి సరఫరా అవుతుంది. అయితే ఈ ఏడాది మహారాష్ట్ర, కర్ణాటకల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఉల్లి సాగుకు భారీ నష్టం వాటిల్లింది. దీంతో అక్కడ దిగుబడులు పూర్తిగా తగ్గాయి. ఇటీవలి వరదల కారణంగా ఉల్లి ధరలు పెరగుతాయన్న సంకేతాల నేపథ్యంలో కేంద్రం ఇప్పటికే 50 వేల టన్నుల ఉల్లిని నాఫెడ్‌ ద్వారా సేకరించి నిల్వ చేసింది. వచ్చే నెలలో ఉల్లి ధరలు మరింత పెరిగిన పక్షంలో నిల్వచేసిన ఉల్లిని మార్కెట్‌లోకి అందుబాటు లోకి తెచ్చి ధరను నియంత్రిస్తామని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ, వినియోగదారులశాఖ మంత్రి రాంవిలాస్‌ పాశ్వాన్‌ ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఉల్లి వ్యాపారులు నిల్వలు పెంచకుండా చూడటం, వారిపై నియంత్రణ చర్యలు చేపడితేనే ఉల్లి ధరలకు క్లళెంపడే అవకాశం ఉంది. లేదంటే మున్ముందు వంటింట్లో ఉల్లి ఘాటు తప్పేలా లేదని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి. దీనిని అధిగమించేందుకు బఫర్‌ స్టాక్‌ విడుదల చేసి, నల్లబజారుపై దాడులు చేయాలని సూచిస్తున్నారు.