ఉల్లి రైతుల నష్టాల సాగు

మార్కెట్లో ధరలు ఉన్నా గిట్టుబాటు కష్టమే
వికారాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ఉల్లి రైతులకు నిల్వ గోదాములు లేకపోవడంతో నష్టపోతున్నారు. మార్కెట్లో ఉల్లి ధరలు పెరుఉతూనే ఉన్నా రైతులకు మాత్రం ఆ మేరకు ధరనలు అందడం లేదు. నిల్వ చేసుకునేందుకు అనువైన స్థలం లేకపోవడంతో ధర రాకున్నా తక్కువకు అమ్ముకోవాల్సి వస్తోందన్నారు. కొందరు రైతులు గడ్డను పంట పొలాల వద్దనే నిల్వ చేసుకుంటున్నారు. కోల్డ్‌ స్టోరేజీలు ఉంటే ధర వచ్చినప్పుడే అమ్ముకునే వీలుంటుందని రైతులు ఆశిస్తున్నారు.  వికారాబాద్‌ జిల్లాలో దాదాపు రైతులంతా ఇదే దుస్థితిని ఎదుర్కొటున్నారు. జిల్లాలో నిరుడు వర్షాలు ఆశించిన మేరకు కురవడంతో భూగర్భ జలాలు పెరిగాయి. ఫలితంగా ఉల్లి సాగు విస్తీర్ణం సైతం భారీగా పెరిగింది. వాతావరణ పరిస్థితులు సైతం అనుకూలించడంతో దిగుబడి సైతం ఆశాజనకంగానే ఉన్నా ధర మాత్రం నిరాశాజనకంగా మారింది. ఎకరానికి 40 నుంచి 60 క్వింటాళ్ల దిగుబడి వచ్చిందన్నారు. విపణిలో ఉన్న ధరకు పెట్టుబడులు మాత్రమే వస్తున్నాయని, ఆరుగాలం కష్టపడిన శ్రమకు ఫలితం దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పంట చేతికి రాగానే  కొనుగోలు చేసేవారు దిక్కులేక రైతులు అల్లాడిపోతున్నారు. గిట్టుబాటు ధర అటుంచి అవసరాలకు అమ్ముకోవడానికి యార్డుకు వెళ్తే వ్యాపారులు సిండికేట్‌గా మారి అన్నదాతను నిలువు దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించకపోవడంతో వ్యాపారులు నిర్ణయించిన ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. ఎకరానికి రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు పెట్టుబడి
అవుతోందని అన్నారు. వికారాబాద్‌ విపణికి రోజుకు అయిదు వందల వరకు పైగా ఉల్లిగడ్డ బస్తాలు వస్తుండటంతో వేలం పాట కాక పేరుకుపోతున్నాయి.  రైతులు రెండు రోజులపాటు పంటను విక్రయించడానికి మార్కెట్‌లోనే వేచి ఉండాల్సి వస్తోంది. ఇక్కడ ఉల్లి నిల్వకు యార్డులో సరిపోను షెడ్లు లేవు. యార్డులో రహదారులపైనే ఉల్లిగడ్డలను నిల్వ చేయాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. మరోవైపు పంట అధికంగా రావడంతోనే పూర్తిస్థాయిలో కొనుగోలు చేయలేకపోతున్నామని వ్యాపారులు తెలిపారు.