ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు

ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బంది అప్రమత్తం
వరంగల్‌,మే15(జ‌నంసాక్షి): వేసవి ఎండలు మరో పక్షం రోజులు తప్పేలా లేవు. నైరుతి కేరళను తాకినా మనవరకు రావడానికి మరో పక్షంరోజులు పడుతుంది. అప్పటి వరకు ఎండల బాధ తప్పేలా లేదు. మండుటెండలతో ప్రజలు నానా ఇబ్బందులుపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎండతీవ్రతతో వడదెబ్బ తగలకుండా తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆస్పత్రులలోఎక్కువగా వడదెబ్బ కారణంగా, డి హైడ్రేషన్‌ కేసులు వస్తున్నాయని అన్నారు. అత్యవసర పనులుంటే ఎండలో తిరగవద్దని, ఒక వేళ వెళ్లేటప్పుడు మంచినీటిని వెంట తీసుకెళ్లాలన్నారు. వడదెబ్బకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏఎన్‌ఎంలు, ఆశాకార్యకర్తలతో వారికి అవగాహన కల్పించేందుకు జిల్లాల్‌ఓ చర్యలు తీసుకుంటున్నారు. ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ఎండలతో జ్వరాలు, వాంతులతో చాలా మంది ఆసుపత్రులకు వస్తున్నారు. దీంతో పిహెచ్‌సి స్థాయిలో ఆసుపత్రిలో అవసరమైన అన్ని రకాల మందులు, సైలైన్లు, ఓఆర్‌ఎస్‌ పొట్లాలను అందుబాటులో ఉంచారు.  అవసరమున్న వారు ఆసుపత్రిలో సంప్రదించి మందులు పొందాలన్నారు. . గ్రామాల్లో ఎవరికైన జ్వరం, వాంతులు విరేచనాలతో బాధపడుతుంటే వెంటనే ఆసుపత్రికి తరలించా లన్నారు.  గ్రావిూణ ప్రాంతాల్లో వాగులు, చెలమల్లో నీరు తాగితే వ్యాధులు వచ్చే అవకాశముంది. స్వచ్ఛమైన నీరు తాగాలి. వేడిచేసి చల్లార్చిన నీటిని తాగితే మంచిది. జ్వరం వచ్చి వాంతులు, విరేచనాలు అయ్యే అవకాశం ఉంది. ఇలాంటి సమయంలో వెంటనే వైద్యులను సంప్రదించాలి. కడుపు, మెడ, అరికాళ్లు, అరచేతులపై తడిగుడ్డతో తుడవాలని, వైద్యుల సూచనలు పాటించాలన్నారు. ఉపాధి కూలీలు ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చేస్తున్నారు. ఎండదెబ్బ తగలకుండా తలకు రుమాలు లేదా గొడుగు వెంట తీసుకెళ్లాలన్నారు. . ఎండలో తిరగడంతో శరీరంలో సోడియం, పొటాషియం స్థాయి తగ్గే అవకాశం ఉంది. ఇందుకు ఓఆర్‌ఎస్‌ ద్రావణం తీసుకుంటే కొంత ఉపశమనం పొందవచ్చన్నారు.