ఎండిన వరిపంట చూసి గుండెపోటుతో రైతు మృతి

చిలుకూరు: నల్గొండ జిల్లా చిలుకూరు మండల పరిధిలోని కొమ్ముబండతండాకు చెందిన హరిసింగ్‌(60) గుండెపోటుతో బుధవారం మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం ప్రకారం… హరిసింగ్‌ తనకున్న 6 ఎకరాల వ్యవసాయ భూమిలో వరి సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా వర్షాలు లేకపోవటంతో సాగు చేసిన వరి పంట ఎండిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన హరిసింగ్‌ బుధవారం పొలం వద్దకు వెళ్లి ఎండిపోయిన వరి పంటను చూసి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హరిసింగ్‌ మృతి చెందాడు