ఎంపీ, ఉత్తరాఖండ్‌లో.. ఎస్పీ-బీఎస్పీ పొత్తు ఖరారు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి25(జ‌నంసాక్షి) : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎస్పీ-బీఎస్పీ ఇప్పటికే పొత్తును ప్రకటించగా, తాజాగా మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో కలిసి పోటీచేసే స్ధానాలపై ఇరు పార్టీలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఈ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ముందు పొత్తు వివరాలను బీఎస్పీ, ఎస్పీ చీఫ్‌లు మాయావతి, అఖిలేష్‌ యాదవ్‌ సోమవారం అధికారికంగా ప్రకటించారు. ఉత్తరాఖండ్‌లోని ఐదు లోక్‌సభ స్ధానాల్లో ఎస్పీ రెండు స్ధానాల్లో, బీఎస్పీ మూడు స్ధానాల్లో పోటీ చేస్తాయి. ఇక మధ్యప్రదేశ్‌లో ఎస్పీ బాల్ఘాట్‌, టికంగఢ్‌, ఖజరహా స్ధానాల్లో పోటీచేస్తుంది. బీఎస్పీ మిగిలిన 26స్ధానాల్లో తమ అభ్యర్ధులను బరిలో దింపుతుంది. ఇక యూపీలో ఇప్పటికే ఎస్పీ-బీఎస్పీలు సీట్ల సర్ధుబాటును ప్రకటించిన సంగతి తెలిసిందే. 80 లోక్‌సభ స్ధానాలు కలిగిన యూపీలో ఎస్పీ 37 స్ధానాల్లో బీఎస్పీ 38 స్ధానాల్లో పోటీ చేయనున్నాయి.
మూడు సీట్లు ఆర్‌ఎల్డీకి కేటాయించిన ఎస్పీ-బిఎస్పీ రాహుల్‌, సోనియా పోటీ చేసే అమేథి, రాయ్‌బరేలి నియోజకవర్గాల్లో పోటీకి దూరంగా ఉంటామని ప్రకటించాయి.