ఎన్టీఆర్‌ దెబ్బకు ఇందిరాగాంధీయే వణికారు

ఇప్పుడు బాబు దెబ్బకు మోడీ దిమ్మ తిరగాలి
నటి దివ్యవాణి హెచ్చరిక
న్యూఢిల్లీ,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): ఢిల్లీలో జరుగుతున్న ధర్మ పోరాటం.. చంద్రన్న ధర్మ పోరాటమని టీడీపీ నేత, సినీనటి దివ్యవాణి అభివర్ణించారు. సోమవారం ఏపీ భవన్‌ ప్రాంగణంలో చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ధర్మమంటే తెలియనటువంటి.. అవినీతికి ప్రతీకగా ఉన్నటువంటి నరేంద్రమోదీ బుర్ర తిరిగే విధంగా ఆంధ్ర ప్రజలు ఈరోజు ఆవేదన, ఆవేశంతో బాధపడుతూ చేస్తున్న ధర్మపోరాటమని అన్నారు. గుంటూరులో మోదీ సభకు వైసీపీ ఇచ్చిన బిర్యానీ, డబ్బులకు ఆశపడి వచ్చిన జనమని ఆమె ఆరోపించారు. ఇవాళ ఆంధప్రజలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తున్నారని, మోదీ తాత సొమ్మేవిూ అడగడంలేదని దివ్యవాణి అన్నారు. న్యాయానికి ప్రతీకగా ప్రజలంతా తమ కుటుంబాలను కాదనుకొని, చంద్రబాబు చేస్తున్న దీక్షకు మద్దతు తెలుపుతూ ఇక్కడికి వచ్చారని అన్నారు. ‘మోదీ.. నీ వేలుతో నీ కన్నును పొడుచుకుంటున్నావని’ ఆమె అన్నారు. నాడు ఎన్టీఆర్‌ దెబ్బకు కొమ్ములు తిరిగిన ఇందిరాగాంధే వణికిపోయారని, ఇప్పటికైనా ఆంధ్రరాష్ట్ర ప్రజల ఆవేదన అర్థం కావడంలేదా? అని మోదీని దివ్యవాణి ప్రశ్నించారు. ఆనాడు అధికారం కోసం చంద్రన్న కాళ్లదగ్గరకు వచ్చి అడుక్కోలేదా? అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ముందు తిరుపతికి వచ్చి మాట్లాడిన మోదీ ఇచ్చిన హావిూలు విస్మరించారని ఆమె విమర్శించారు. పరిపాలన చేతకాకపోతే చంద్రన్నదగ్గరికొచ్చి నేర్చుకోవాలని ఆమె మోదీకి సూచించారు. కాగా చంద్రబాబు ఢిల్లీలో చేపట్టిన దీక్షకు మద్దతుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ర్యాలీలు చేపట్టారు.