ఎన్నికలకు అధికార యంత్రాంగం సన్నద్దం

ఖమ్మం,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ ఎన్నికల నగరా మోగడంతో జిల్లా అధికార యంత్రాంగం కూడా ఎన్‌ఇనకల నిర్వహణ కోసం  సిద్ధమవుతోంది. ఇప్పటికే పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, ఈవీఎంల సరఫరా,
ఓటర్ల జాబితాపై అధికారులు దృష్టి పెట్టారు. ఓటర్ల నమోదు పక్రియలో భాగంగా ఈనెల రెండుమూడు తేదీల్లో స్పెషల్‌ క్యాంపులను నిర్వహించారు. ఇప్పటికే గతనెల 22వతేదీన పార్లమెంట్‌ ఎన్నికల ఓటర్ల ముసాయిదాను విడుదల చేశారు.  పార్లమెంట్‌ ఎన్నికల్లో పోలింగ్‌ శాతాన్ని పెంచేందుకు జిల్లావ్యాప్తంగా ఈవీఎం, వీవీ ప్యాట్‌ల ద్వారా ఓటరు అవగాహన కార్యక్రమాలున నిర్వహిస్తున్నారు. ఈవీఎంల తొలిదశ పరిశీలన పూర్తవగా, రెండోదశ పరిశీలన త్వరలో చేపట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కలెక్టర్‌ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ సిబ్బందికి శిక్షణా తరగతులను నిర్వహించడంతో పాటు బ్యాలెట్‌ బాక్సులు, బ్యాలెట్‌ పేపర్లు, మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ తదితర విభాగలకు జిల్లాసాయి నోడల్‌ అధికారులను నియమించనున్నారు. పోలింగ్‌ కేంద్రాలను గుర్తించడంతో పాటు, ఆయా కేంద్రాల్లో అవసరమైన వసతులను ఏర్పాటు చేయనున్నారు. పార్లమెంట్‌ ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌, ఓటరు జాబితా ప్రత్యేక సవరణ, ఓటరు అవగాహన కార్యక్రమాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గత నెలలో జిల్లా కలెక్టర్‌తో చర్చించి పలు సూచనలు చేశారు. అదనంగా అవసరమైన ఈవీఎంలను ఆయా జిల్లా కేంద్రాలకు తరలించేందుకు జిల్లా కలెక్టర్లు తగు చర్యలు తీసుకోవాలని, జిల్లా కేంద్రాలకు వచ్చిన ఈవీఎంలకు ఫస్ట్‌ లెవల్‌ చెకింగ్‌ను పూర్తి చేయాలని ఆయన సూచించారు. అదేవిధంగా ఈవీఎం, వీవీప్యాట్‌ల అవగాహన కార్యక్రమాలను ముమ్మరం చేసి ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. స్పెషల్‌ డ్రైవ్‌ ద్వారా ఓటరుగా నమోదుకు మిగిలిన యువత తమ పేర్లను ఓటరుగా నమోదు చేసుకొనుటకు విస్తృత ప్రచారం కల్పించాలని ఆయన సూచించారు.