ఎన్నికల్లో ఒంటరి పోరు చేస్తాం

ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకుని వెళతాం: కోదండరామ్‌

కరీంనగర్‌,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి ): ప్రజా సమస్యలపై అందరితో కలిసి పోరాటం చేసినా ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేకతను ప్రజల వద్దకు తీసుకుని వెళతామన్నారు. కరీంనగర్‌లో ఆయన విూడియాతోమాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎంతసేపూ ఏ భవనం కూల్చాలి.. ఏ స్థలం కబ్జా చేసుకోవాలన్న ఆలోచనే తప్ప అభివృద్ది గురించి ఆలోచించడం లేదని విమర్శించారు. కోరుకున్న అభివృద్ది జరగడం లేదన్న కోదండరామ్‌, తెలంగాణ ఆకాంక్షలు వెనక్కి పోయాయని అన్నారు. ఇంతకన్నా దారుణం ఉండదన్నారు. ఏ ఒకరిద్దరి కోసమో తెలంగాణ పోరాటం జరగేలదన్నారు. ముఖ్యమంత్రి కరీంనగర్‌లో నాటిన మొక్కను కాపాడుకోవడానికి పోలీసు పహారా, నీటి కోసం ప్రత్యేకంగా ఓ నీటి ట్యాంకు ఏర్పాటు చేశారని ఎద్దేవా చేశారు. ఇక హరితహారం తెలంగాణలో ఎలా ఉందో చూడాలన్నారు. మరోవైపు రైతులు తమ పొలాలను కాపాడుకోవడానికి ఆందోళనలు చేస్తుంటే కేసులు పెడుతున్నారని విమర్శించారు. సంటలకు నీరివ్వమంటే ఇవ్వలేని దుస్థితి ఉందన్నారు. ఇదేనా రైతు సంక్షేమం అంటే అని నిలదీసారు. తెలంగాణ సాధించడానికి అసువులు బాసిన అమరవీరుల స్తూపంతో పాటు అంబేడ్కర్‌ స్తూపం నిర్మించడానికి ప్రభుత్వం ఆసక్తి కనబర్చడం లేదని.. దీనికి నిరసనగా హైదరాబాద్‌లో నిరసన దీక్ష చేపట్టనున్నట్లు కోదండరామ్‌ వెల్లడించారు.