ఎన్నికల హావిూల అమల్లో వైఫల్యం: కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,జూలై21(జ‌నం సాక్షి): ఎన్నికల హావిూల అమలులో టీఆర్‌ఎస్‌ పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనతోపాటు ఉద్యోగాలు రాని వారికి నెలకు రూ.3 వేల భృతి చెల్లిస్తామన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.సంక్షేమ పథకాల అమలులో టీఆర్‌ఎస్‌ ప్రజలను మోసం చేసిందన్నారు. దళితులకు భూ పంపిణీ, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు, కేజీటు పీజీ, నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చతికిలపడిందన్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో సీట్లు అమ్ముకున్న ఘనత టీఆర్‌ఎస్‌ నాయకులదేనని ఆరోపించారు. మద్యం దుకాణాలకు అనుమతులిచ్చి, పక్కనే పోలీసులతో తనిఖీలు చేయించి కేసులు నమోదు చేయించడం ఎంతవరకు సమజంసమని ప్రశ్నించారు. జిల్లాలో ప్రజల కోసం పని చేసే అధికారులు టీఆర్‌ఎస్‌ నాయకులకు నచ్చడం లేదన్నారు. ఎల్‌డీఎంఆర్‌సీ కార్యక్రమం కింద జిల్లాలోని తటస్థులను పార్టీలోకి చేర్పించే కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పని చేయాలని పిలుపునిచ్చారు.